Friday, April 19, 2024

కొలువుల కేబినెట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, లక్ష్యా లు, కార్యాచరణ, కేంద్రం ఆంక్షలపై రాష్ట్ర మంత్రివర్గంలో వాడీవేడిగా సమావేశం జరిగినట్టుగా తెలిసింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన కేబినెట్ భేటీలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశం సుమారు ఐదుగంటల పాటు కొనసాగింది. పో లీస్ సైబర్ టీం బలోపేతంలో భాగంగా భారీ రిక్రూట్‌మెంట్ సహా రైతుబంధు నిధుల విడుదల, ఇంటి నిర్మా ణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం, పోడు భూములు సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

దీంతో పాటు ఈ సమావేశంలో 3,966 పోలీస్ పోస్టులకు ఆమోదం, రోడ్లు, భవనాల శాఖకు ని ధులు కేటాయింపు, పలు ఇంజినీర్ పోస్టులకు రి క్రూట్‌మెంట్, బిసి సంక్షేమ శాఖలో 2,591 నూత న ఉద్యోగాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిసింది.శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి ఏడున్నర వరకు కొనసాగిం ది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డిఏలు, వాటి మంజూరు అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పోడు భూముల అంశాన్ని కేబినెట్ సమీక్షించగా సర్వే, గ్రామ సభలు పూర్తయిన తరుణంలో క్షేత్రస్థాయి స్థితిగతులు, తదుపరి కార్యాచరణపై చర్చించినట్టుగా సమాచారం.

రాష్ట్ర పోలీసు శాఖ మరింత పటిష్టం
రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చే యాలని కేబినేట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీయడంతో పాటు శాంతిభద్రతల సమస్యగా పరిణమించాయని ఈ సమావేశం చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టడంతో పాటు వాటి ని నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటెక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూ రో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీల్లో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినేట్ ఆదేశించింది. వీటితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్ర తలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్‌స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
రోడ్లు, భవనాల శాఖ మరింత పటిష్టం
రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు, భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతుందని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవా ణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అదనపు నిధులను కూడా మంజూరు చేసింది.

అత్యవసర సమయా ల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది.రోడ్లు, భవనాల శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులతో పాటు 12 సూపరింటెండెంట్ ఇంజనీర్, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 102 డిఈఈ, 163 అసిస్టెంట్ ఈఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దీంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.

పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బి శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్ కార్యాలయాలను, 13 డివిజన్ కార్యాలయాలను, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది.
తక్షణమే పనులకు రూ. 635 కోట్లు
రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు, ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు, ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతులకు ( పీరియాడిక్ రెన్యువల్స్)ల కోసం రూ. 1,865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిఈఈ నుంచి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు తీసుకునేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకొని పనులు చేపట్టేందుకు డిఈఈ చేపట్టే ఒక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి రూ.25 లక్షలు), ఈఈకి రూ.25 లక్షల వరకు (ఏడాదికి రూ.1.5 కోట్లు), ఎస్‌ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి రూ.2 కోట్లు), సీఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి రూ.3 కోట్ల వరకు) పనులను చేపట్టేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇందుకోసం ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బి శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది.
ఇదే పద్ధతిని అనుసరిస్తూ భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News