Thursday, March 28, 2024

వరుణ్ గాంధీ సిద్ధాంతాలను ఎన్నటికీ ఆమోదించను: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన చిన్నాన్న సంజయ్ గాంధీ కుమారుడు, బిజెపి ఎంపి వరుణ్ గాంధీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ సోదరుడైన సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి బిజెపి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా పంజాబ్‌లో మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వరుణ్ గాంధీ ప్రాస్తావన వచ్చింది.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తమ ఇద్దరివీ భిన్న సిద్ధాంతాలని, వరుణ్ గాంధీ సిద్ధాంతాలతో తాను ఏకీభవించబోనని చెప్పారు. ఆయనను(వరుణ్) తాను కలుసుకోవచ్చని, ఆలింగనం చేసుకోవచ్చని, కాని..ఆయన సిద్ధాంతాలను తాను ఆమోదించబోనని రాహుల్ స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ బిజెపిలో ఉన్నారు. ఆయన సిద్ధాంతాలకు, నా సిద్ధాంతాలకు పొసగదు. ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే అంతకన్నా ముందు నా తల నరుక్కుంటాను. నా కుటుంబానికి ఒక సిద్ధాంతం ఉంది. వరుణ్ గాంధీ మరో సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారు. ఆయన సిద్ధాంతాన్ని నేను ఆమోదించను అని రాహుల్ తెలిపారు.

దేశంలోని వ్యవస్థలన్నీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని రాహుల్ అన్నారు. అన్ని వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నియంత్రిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మ్రీడియా సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని, అధికార యంత్రాంగం ఒత్తిడిలో ఉందని, ఎన్నికల కమిషన్ ఒత్తిడిలో ఉందని, న్యాయ వ్యవస్థ కూడా ఒత్తిడిలో ఉందని ఆయన ఆరోపించారు. ఇది ఒక రాజకీయ పార్టీకి, మరో రాజకీయ పార్టీకి మధ్య పోరాటం కాదని, బజెపి,ఆర్‌ఎస్‌ఎస్ గుప్పిట్లో బందీగా ఉన్న దేశంలోని అన్ని వ్యవస్థలకు, ప్రతిపక్షానికి మధ్య పోరామని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News