అమెరికా పరిశోధకుల నివేదిక
హూస్టన్: అమెరికాలోని భారత్, పాకిస్థాన్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ యవ్వన దశలోనే తీవ్ర రూపం దాల్చుతున్నదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2014 వరకు అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ సర్వేలెన్స్ సేకరించిన డేటా ఆధారంగా పరిశోధకులు విశ్లేషించారు. అమెరికాలోని ఆంగ్లో అమెరికన్ మహిళలతో పోలుస్తూ క్యాన్సర్ తీరును పరిశీలించారు. మొత్తమ్మీద ఆంగ్లో అమెరికన్ మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల భారత్, పాక్ మహిళల్లో గతంతో పోలిస్తే కేసులు అధికమవుతున్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ నివేదిక పేర్కొన్నది.
2000 నుంచి 2016 వరకు సేకరించిన మరో డేటాను కూడా పరిశోధకులు పరిశీలించారు. క్యాన్సర్ వల్ల చనిపోతున్న మహిళల్లో ఆంగ్లో అమెరికన్లే అధికమని డేటా వెల్లడించింది. అయితే, క్యాన్సర్ పట్ల అవగాహన, చికిత్స విషయంలో భారత్, పాక్ మహిళలు వెనకబడి ఉన్నారని, వీరిలో సంప్రదాయిక విశ్వాసాల వల్ల వెంటనే నిపుణులతో సంప్రదించలేకపోతున్నారని నివేదిక పేర్కొన్నది. హెల్త్ కేర్ అవగాహన పెరిగితే వీరిలో క్యాన్సర్ బాధితుల సంఖ్య అదుపులో ఉంటుందని నివేదిక పేర్కొన్నది.