మానేరు వంతెన పైనుంచి పడిన కారు, ఒకరి మృతి, ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లి జారిపడి కానిస్టేబుల్ దుర్మరణం
కరీంనగర్ క్రైం : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెన పైనుండి ఆదివారం రోజు ఉదయం ఓ కారు కిందపడటంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తల్లో భర్త మృతి చెందగా భార్య గాయాలపాలైంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ సైతం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన గండి శ్రీనివాస్ (40) అనే వ్యక్తి గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య స్వరూప, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. అయితే కొమురవెళ్ళి మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్ళేందుకు కారులో భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తరువాత మానేరు వంతెన వద్ద వెనక నుండి ఓ వాహనం కారును ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి బ్రిడ్జి రేలింగ్ను ఢీకొని వంతెన పైనుండి కింద వాగులో పడిపోయింది. ఈ సంఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య స్వరూప గాయాలతో బయటపడింది.
ఇదిలా ఉండగా సంఘటన విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమై వివరాల సేకరణ కోసం బ్లూకోర్ట్ విధులు నిర్వహిస్తున్న ఇరువురు కానిస్టేబుళ్ళను ఘటనా స్థలానికి పంపించడం జరిగింది. మానేరు వంతెనపై నుండి కారు పడిన స్థలాన్ని పరిశీలిస్తూ వివరాలు సేకరించే పనిలో ఉన్న బ్లూకోర్ట్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపైనుండి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో అతను గాయపడగా వైద్యచికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే అతను మృతి చెందారు. చంద్రశేఖర్ 1990 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ కాగా ప్రస్తుతం కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
చంద్రశేఖర్ మృతి తమను కలచివేసిందని ఆయన బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్ళు పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్రెడ్డిలు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం పక్షానా అదుకుంటామని తెలియజేయగా కానిస్టేబుల్ మృతి చాలా బాధకరమని సి.పి వి.బి.కమలాసన్రెడ్డి పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1228958278194847744