లాఠీ ఛార్జ్ చేశారంటూ నకిలీ వీడియో ప్రసారం
నగర సిపి అంజనీకుమార్ ఆదేశాలు
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కర్ఫ్యూ విధించడంతో పోలీసులు లాఠి ఛార్జ్ చేస్తున్నారని నకిలీ వీడియోలు ప్రచారం చేసిన రిపోర్టర్పై కేసు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూను అమలు చేసేందుకు రాత్రి సమయంలో పోలీసులు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. హైదరాబాద్లో కర్ఫ్యూ సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని నకిలీ వీడియోను తన ఛానల్లో ప్రసారం చేశాడు. ఇది గమనించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నకిలీ వీడియోను ప్రసారం చేసిన రిపోర్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి సమయంలో విధించే కర్ఫూకు ప్రజలు సహకరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని సిపి అంజనీకుమార్ కోరారు.