కరీంనగర్ క్రైం : గత రెండు నెలల క్రితం కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో నమోదైన గర్భిణీపై లైంగికదాడి కేసు మలుపు తిరుగుతోంది. నాడు ఒకే వ్యక్తి గర్భిణీపై లైంగికదాడికి పాల్పడినట్లు కేసు నమోదు కాగా నేడు బాధితురాలు ఆమె కుటుంబసభ్యులు కలిసి కరీంనగర్ రూరల్ ఎ.సి.పి విజయసారధిని కలిసి తమగోడు చెప్పుకున్నారు. నాడు గ్రామపెద్దలు, ఇతరుల ఒత్తిడితో ఒకే వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పిన బాధితురాలు నేడు నిజాలను లిఖితపూర్వకంగా రాసి కరీంనగర్ రూరల్ ఎ.సి.పికి అందజేసింది. బాధితురాలి సహా ఆమె కుటుంబసభ్యులు కలిసి బుధవారం నగరంలోని పాత్రికేయుల భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తమ బాధను చెప్పుకున్నారు.
వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 29 సంవత్సరాల వయసు గల యువతి వివాహం సంవత్సరం క్రితం మానకొండూర్ మండలంలోని వెల్ధి గ్రామానికి చెందిన రాజేశం అనే వ్యక్తితో జరిగింది. వివాహం జరిగిన తరువాత వారు కరీంనగర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో గత 9 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న భర్త వద్దకు చేరింది. రాజేశం ఎల్.ఐ.సిలో సెక్యూరిటీ గార్డుగా బాధ్యతలు నిర్వహిస్తూ రోజు బొమ్మకల్ గ్రామం నుండి విధులకు వెళ్ళి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆయన భార్య గర్భం దాల్చగా అదే గ్రామానికి చెందిన డిష్ అపరేటర్ అయినటువంటి కనపర్తి రామకృష్ణ సెటప్ బాక్స్ రిపేర్ పేరుతో ఇంటికి వచ్చి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు ఏవరికి చెప్పిన చంపుతానంటూ బెదిరించాడు. బాధితురాలి ఏవరికి చెప్పుకోలేకపోవడంతో ఆమె ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో కన్నవేని నరేష్యాదవ్ అలియాస్ లడ్డు అనే యువకుడిని వెంట తీసుకోని వచ్చి లైంగికదాడిని సెల్ఫోన్లో రికార్డు చేయడం జరిగిందని బాధితురాలు రోధిస్తూ పేర్కొంది.
సెల్ఫోన్ రికార్డును ఆధారం చేసుకుని కేవలం రామకృష్ణనే కాకుండా బొట్ల అనిల్, కన్నవేని నరేష్, వనం హరిప్రసాద్లు కలిసి సామూహికంగా లైంగికదాడికి పాల్పడి చిత్రహింసలకు గురిచేసేవారని పేర్కొంది. వీరికి గొల్లపల్లి రాజేశ్వరీ సహా గంట భారతి అనే మహిళలు సహకరించేవారని తెలిపింది. తనకు 9వ నెల గర్భం వచ్చేంతవరకు కూడా జాలిలేకుండా తనపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె వివరించింది. గత సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన వారు పెట్టే చిత్రహింసలను భరించలేక ఎదురుతిరిగిన క్రమంలో వాళ్ళు తనను కొట్టగా ఆ గర్షణలో తన తాళి తెగిపోయిందిన ఇదేరోజు తన భర్త ఆ విషయాన్ని అడగ్గా జరిగిన సంఘటనను వివరించడం జరిగిందని బాధితురాలు తెలియజేసింది.
బాధితురాలి భర్త రాజేశం మాట్లాడుతూ భార్యపై జరిగిన దారుణాన్ని గ్రామసర్పంచ్ దృష్టికి తీసుకుపోగా పోలీస్స్టేషన్ వరకు విషయాన్ని తీసుకుపోవద్దని చెప్పి న్యాయం చేస్తామంటే ఒప్పుకోవడం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయకపోగా తమపైనే పోలీసులకు తప్పుడు సమచారం అందించడం జరిగిందన్నారు. దీంతో జనవరి 16వ తేదీన బాధితురాలు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్దపడుతుండగా పలువురు గ్రామస్తుల సూచనల మేరకు రామకృష్ణ మీద ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా నిజాలు తెలిసిన తమను కొందరు వ్యక్తులు బెదిరించడమే కాకుండా ఈనెల 6వ తేదీన గ్రామం నుండి గెంటేయడం జరిగిందన్నారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను కోరుతుంది.