నేడు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు
కోర్టుకు హాజరు కానున్న బిజెపి సీనియర్ నేతలు
ఎల్కె అద్వానీ, మురళీమనోహర్జోషి
లఖ్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనున్నది. ఈ కేసులోని నిందితుల్లో
జీవించి ఉన్న 32మందిని తీర్పు సమయంలో కోర్టులో ఉండాల్సిందిగా ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కె యాదవ్ ఈ నెల 16న ఆదేశించారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30 వరకల్లా పూర్తి చేసి తీర్పు వెల్లడించాలని ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. దాంతో, తీర్పు వెల్లడిస్తున్నారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ కేసులో నిందితులుగా మాజీ ఉపప్రధాని, బిజెపి సీనియర్ నేత ఎల్కె అద్వానీ, మరో సీనియర్ నేత మురళీమనోహర్జోషి, కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి, యుపి మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్, వినయ్ కటియార్, సాధ్వి రితంబర,రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ఉన్నారు. ప్రస్తుతం ఉమాభారతి, కల్యాణ్సింగ్ కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి కోర్టులో హాజరీ విషయంలో మినహాయింపు ఉంటుందా..? లేదా..? అన్న దానిపై తెలియాల్సి ఉన్నది. కల్యాణ్సింగ్ యుపి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైంది.
CBI Court to Judgment on Babri verdict Tomorrow