హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పండగ జరుపుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ, పూర్తి ప్రమాదం పోలేదన్నారు. ఇప్పటికే కేరళలో ఓనం పండుగ ద్వారా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించకపోవడం వలనే అక్కడ వైరస్ వ్యాప్తి బారిగా పెరిగిందన్నారు.
గత ఏడు నెలలుగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించినటే,్ల పవిత్రమైన బతుకమ్మ, దసరా పండుగలతో పాటు దీపావళీ, క్రిస్మస్ ఫెస్టివల్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీటిని ఈ ఏడాది కుటుంబ సభ్యుల మధ్య ఇళ్లల్లో మాత్రమే జరుపుకోవాలన్నారు. వేలాది మంది గూమికూడేలా ఏర్పాట్లు చేసుకోవద్దని సూచించారు. బతుకమ్మ సందర్బంగా నిర్వహించే నృత్యాలు, దసరా అలయ్ బలయ్ కార్యక్రమాల్లో వైరస్ విపరీతంగా వ్యాప్తి చేందే అవకాశం ఉన్నందున వాటిని వీలైనంత వరకు నిర్వహించుకోకపోవడం మేలని ఆయన అన్నారు. ప్రజలంతా నిపుణులు, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.