టోక్యో: ఈ నెల 23న (శుక్రవారం) జరగనున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా ప్రారంభ వేడుకలను వెయ్యి మంది లోపు అతిథులతోనే నిర్వహించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్ను నియంత్రించేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కట్సునోబూ కటో తెలిపారు. దాదాపు 70 మంది కేబినెట్ హోదా కలిగిన అధికారులు కూడా జపాన్ వస్తారని తెలిపారు. అయితే విఐపిల సంఖ్యపై అనిశ్చితి ఉందని తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, మంగోలియా ప్రధాని ఓయూన్ ఎర్డినే, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సహా పలువురు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరు కానున్నట్లు కటో తెలిపారు. కాగా భారత్నుంచి ఆరుగురు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ప్రస్తుతం జపాన్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో కొందరు ప్రముఖులు తమ పర్యటనను రద్దుచేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.