బర్డ్ఫ్లూపై రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ పరీక్షలకు సంబంధించి పాటించాల్సిన నిబంధలపై రాష్ట్రాలకు ఇప్పటికే అడ్వైజరీలను జారీ చేయడం జరిగిందని కేంద్రం మంగళవారం తెలిపింది. అంతేకాదు, వైరస్ సోకిన పక్షులను పూడ్చిపెట్టడానికి అవసరమైన పిపిఇ కిట్లను, ఇతర పరికరాలను తగినంతగా నిల్వ ఉంచుకోవాలని కూబా రాష్ట్రాలకు సూచించింది. సోమవారం నాటికి బర్డ్ ఫ్లూ వైరస్ పది రాష్ట్రాలు ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, గుజరాత్లలో నిర్ధారణ అయింది. అలాగే మంగళవారం నాడు రాజస్థాన్లోని ఝుంఝును జిల్లా హెచ్సిఎల్ ఖేరి నగర్లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా(హెచ్5ఎన్8) వైరస్కు సంబంధించి అదనపు కేసులు కూడా వెలుగు చూశాయని కేంద్ర మత్స, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జూలాజికల్ పార్క్లో చనిపోయిన కాకులు, పెలికాన్ కొంగల్లో,అలాగే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా జగ్నోలి, ఫతేపూర్ గ్రామాల్లో చనిపోయిన కాకుల్లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లాలో పౌల్ట్రీ శాంపిల్లో హెచ్ 5ఎన్1 వైరస్ ధ్రువీకరణకు సంబంధించిన నివేదిక భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్నుంచి మంగళవారం అందనున్నట్లు కూడాఆ శాఖ తెలిపింది. బర్డ్ ఫ్లూకు సంబంధించి పరీక్షలు నిర్వహించడంపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తమ శాఖ రాష్ట్రాలకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసిందని తెలిపింది. అంతేకాకుండా ఈ వైరస్కు సంబంధించి ప్రజల్లో చైతన్యం కల్పించడానికి, పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై వివిధ మీడియా ప్లాట్ఫారాల ద్వారా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం కృషి చేస్తున్నట్లు కూడా ఆ శాఖ తెలిపింది. కాగా వైరస్ కారణంగా చనిపోయిన పక్షులను పూడి పెట్టడానికి అవసరమైన పిపిఇ కిట్లు, ఇతర పరికరాలను తగినంత నిల్వలు ఉండేలా చూడాలని కూడా తమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సలహా ఇచ్చినట్లు ఆ ప్రకటన తెలిపింది.