ఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా షాపులు, మాల్స్, ఇతరత్రా వ్యాపార వాణిజ్య కేంద్రాలు మూతపడుతున్న సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ దెబ్బతినే ప్రమాదం ఉందన్న కేంద్ర హోంశాఖ, అయినప్పటికీ సెక్యూరిటీ ఉద్యోగులపై ఆ ప్రభావం పడకుండా చూడాలని కోరింది. లాక్డౌన్ కారణంగా ఉద్యోగులు విధులకు రాకపోయినా వారు వచ్చినట్లుగానే భావిస్తూ జీతాలు చెల్లించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటుంటే ప్రైవేట్ కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు తమ ఉద్యోగులకు అభద్రతా భావం కలిగిస్తున్నాయి. శాలరీ పూర్తిగా ఇవ్వలేమని కొన్ని సంస్థలు అంటుంటే లాక్డౌన్ ఉన్నా విధులు నిర్వహించాల్సిందే అని మరికొన్ని ఏజెన్సీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను గమనించిన కేంద్ర హోంశాఖ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను ఉద్దేశించి శాఖాపరమైన సూచన చేసింది. ఈ సమయంలో మానవతా దృక్పథంతో ఉద్యోగులను కాపాడాల్సిన అవసరం ఉందనీ, వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపాలని కోరింది. వాళ్లను ఉద్యోగాల నుంచి తప్పించవద్దనీ, శాలరీలు తగ్గించవద్దని కోరింది.