Thursday, March 28, 2024

సింగరేణిపై కేంద్రం కుట్రను సాగనీయం

- Advertisement -
- Advertisement -

Central conspiracy against Singareni:KTR

ఢిల్లీ కుతంత్రాలను అడ్డుకుంటాం..
తెలంగాణ దెబ్బను రుచి చూపిస్తాం

సంస్థను ఉద్దేశపూర్వకంగా చంపేకుట్రకు కేంద్రం తెరలేపింది అది కోల్‌మైన్ మాత్రమే కాదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న గోల్డ్‌మైన్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు 16వేలకు పైగా ఉద్యోగాలిచ్చాం ప్రైవేటు చేస్తే వారసత్వ ఉద్యోగాలు బంద్ అంతిమంగా సంస్థ కనుమరుగవుతుంది: కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. నరేంద్రమోడీ సర్కార్‌కు ఘాటుహెచ్చరికలు జారీ చేశారు. దురుద్దేశంతో సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ విధానాలను వెంటనే విడనాడాలని సూచించారు. లేనిపక్షంలో టిఆర్‌ఎస్ తడాఖా ఎలా ఉంటుందో కేంద్రానికి రుచి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తూ సోమవారం ఆయన మరోసారి లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ చర్యలను వెంటనే విడనాడాలని, లేనిపక్షంలో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ను వెంటాడి, వేటాడి దేశం నుంచి తరమికొడతామన్నారు.

నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని కెటిఆర్ ఆరోపించారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమన్నారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే….బిజెపిపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయమని హెచ్చరించారు.

కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. సింగరేణిలో ఉన్న జెబిఆర్‌ఒసి…-3, కెకె…-6 , శ్రవనపల్లీ ఒసి, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటి కోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి… గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించడం శోచనీయమన్నారు.ఈ మేరకు కేంద్రం ముందుకు పోవడం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

లాభాల్లో 29 శాతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత 7ఏళ్ళ కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పిఎల్‌ఎఫ్‌ను కలిగి ఉందన్నారు. కేవలం సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర తోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తూ దేశానికి విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదన్నారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తూ సింగరేణి ప్రగతి ప్రస్థానం లో దూసుకెళ్తున్నదని తెలిపారు.

దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటను ఇస్తున్న ఎకైక సంస్ధ సింగరేణి అని కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు కార్మికుల కోసం ఏ ప్రభుత్వరంగ సంస్ధ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, సింగరేణి కార్మిక బిడ్డల కృషితో ఇంతకాలం కార్మికులకు లాభాల్లో వాటాలు అనేది పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయన్నారు. సంస్థను ప్రైవేటుపరం చేస్తే, ఇకనుంచి నష్టాల మూటలు అనేవి ప్రధాన శీర్షికలు అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రగతి పథంలో ఉన్న సింగరేణిని అస్థిర పరిచే కుట్ర

లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బిజెపిఅమలు చేస్తోందని మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం అంధ్రప్రదేశ్ లోనూ ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. కేంద్రం దగ్గర ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కు చెందిన 27 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణికి సైతం బొగ్గు గనులు లేకుండా చేసి సంస్ధను చంపే కుట్రకు తెరలెపిందని కెటిఆర్ అన్నారు.

ఎలాంటి వేలం లేకుండా గుజరాత్‌కు ఎందుకు కేటాయిస్తున్నట్లు

గుజరాత్‌కు మాత్రం అడిగిన వెంటనే కేంద్రం లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ సంస్ధకు కేటాయించిందని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఆ రాష్ట్రానికి ఇచ్చిన విధంగా తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బిజెపి పాలనలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకొక విధానం ఉంటుందా? అని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం కాదా ప్రశ్నించారు. ఇది కేవలం సింగరేణి సంస్ధపై మాత్రమే వివక్ష కాదని, ఇది తెలంగాణ రాష్ట్రంపై వివక్ష అని మంత్రి కెటిఆర్ అన్నారు.

కేంద్రం కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తోంది

కేంద్రం కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, ఈ కుట్రలను అపకుంటే తగిన బుద్ది చెబుతారని కెటిఆర్ అన్నారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్‌మైన్ అని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16వేల నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. కేంద్రం లేవనెత్తిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దండయాత్రగా మంత్రి అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే డాక్టర్ బిఆర్.అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడవడమేనని, రిజర్వేషన్లకు పాతరేసే ఈ కుతంత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వబోమని హెచ్చరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ యువతకు ఉద్యోగాల గని, సింగరేణి అని స్పష్టంచేశారు.

వేలంవెర్రి ఆలోచనలను ఇప్పటికైనా మానుకోవాలి

సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని, ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంటుందని కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని అవకాశాలు పోతాయన్నారు. అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలుకు బొగ్గు అందుతుందని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటీకరణ అయితే ఆయా పరిశ్రమలకు బొగ్గు సరఫరా అందడం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి, వెళ్లి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడుతుందన్నారు. తమ దృష్టిలో కేంద్రం సింగరేణిలోని కేవలం నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని ఆయన విమర్శించారు. ఈ వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే, ఎన్నో విరోచిత పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News