హైదరాబాద్: ఇరవై ఏళ్లక్రితం ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసేంతవరకు వచ్చిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ వసంత్ విహార్లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణంకోసం 1100 చదరపు మీటర్ల స్థలం కు సంబంధించిన పత్రాలను బుధవారం ఢిల్లీలో కేంద్రప్రభుత్వ అధికారి సుమిత్ కుమార్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి,చివరకు ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు,గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించ నుందని చెప్పారు.
ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు గర్వకారణమన్నారు.ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగరవేయాలనే లక్షం నెరవేరుతుందని చెప్పారు. త్వరలో ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో తెలంగాణ చారిత్రిక విలువలకు, సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా సిఎం కెసిఆర్ ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించ నున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన ఉద్యమంలో దేశరాజధానిలో స్వయంపాలనా కాగడాను వెలిగించి తెలంగాణ సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకోవడంతో పాటుగా ఢిల్లీలో టిఆర్స్ జెండా ఎగరవేసేందుకు అధికారికంగా స్థలం సంపాదించడం తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
Central govt allotted space for TRS Bhavan in Delhi