ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి
భౌతిక దూరంలో పాటుగా కొవిడ్ నిబంధనలు పాటించాలి
నటీనటులకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి
మేకప్ సిబ్బందికి పిపిఇ కిట్లు, విజిటర్లకు అనుమతి నో
కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గత అయిదు నెలలుగా నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగ్లు తిరిగి ప్రారంభించడానికి కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆదివారం అనుమతించింది. అలాగే మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతం అమలులో ఉన్న అన్లాక్ 3 ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్లు జరుపుకోవడానికి అనుమతిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. ఇక షూటింగ్ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
వీలయినంత తక్కువ సిబ్బందితో షూటింగ్లు కొనసాగించాలని పేర్కొంది. చిత్రీకరణలో పాల్గొనే నటీనటులందరూ ఆరోగ్య సేతు యాప్ను ఉపయోగించాలని సూచించింది. సినిమా షూటింగ్ సమయాల్లో విజిటర్స్ను ఎవరినీ అనుమతించరాదని స్పష్టం చేసింది. హెయిర్ స్టైల్లిస్టులు, మేకప్సిబ్బంది పిపిఇ కిట్లు ధరించాలని పేర్కొంది. కాస్టూమ్స్, లోకల్ మైక్లను ఎవరికి వారే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా ఔట్డోర్ షూటింగ్లలో వీక్షకులు వీలయినంత తక్కువ సంఖ్యలో ఉండేట్లు చూడాలని, సిబ్బంది బసకోసం ఏర్పాట్లను సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమయితే స్థానిక అధికారుల సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలన్నారు. షూటింగ్ ప్రాంతాల్లో సిబ్బంది థర్మల్స్క్రీనింగ్ తప్పనిసరిగా జరపాలి. అలాగే షూటింగ్ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాగా థియేటర్లలో భౌతిక దూరాన్ని పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలని, టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని సూచించారు.
Central Govt Gives Green Signal to Film Shootings