Friday, April 19, 2024

ఎడాపెడా విదేశీ అప్పు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాల అప్పులపై రకరకాల ఆంక్షలు విధిస్తున్న కేంద్రం గురువింద మాదిరిగా వ్యవహరిస్తోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 152 లక్షల కోట్లకు పెరిగాయని, ఇలా అప్పులు చేయడం మూలంగా ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని కేంద్రమే ఉల్లంఘించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కూడా రికార్డుస్థాయి లో అప్పులు చేసిందని, ఏకంగా రూ.8,02,897 కోట్ల అప్పులు చేసిందని, ప్రపంచంలో ఏ దేశం అప్పులిస్తామన్నా, ఎలాంటి షరతులు విధించినా వెనకాడడం లేదని, అదే సమయంలో చేసే కొద్దిపాటి అప్పులపై మాత్రం ఆంక్షలు విధించడం, బహిరంగ సభల్లో విమర్శలు గుప్పించడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకే చెల్లిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 67 ఏళ్లలో విదేశాల నుంచి భారత్ కేవలం రూ.4.32 లక్షల కోట్లను అప్పులుగా తెచ్చుకోగా, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2015 జనవరి నుంచి ఇప్పటివరకు రికార్డుస్థాయిలో రూ.3.70 లక్షల కోట్లు అ ప్పుగా తెచ్చుకుందని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు.

గత 67ఏళ్లలో ఏడాదికి సగటున రూ.6,367 కోట్లు విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోగా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సగటున ఏడాదికి రూ.46,205 కోట్ల నిధులను అప్పులుగా తెచ్చుకుంది. అంటే తాజా లెక్కల ప్రకారం విదేశాల నుంచి తెచ్చుకొన్న మొత్తం అప్పులు రూ.8,02,897 కోట్లని కేంద్ర ప్రభుత్వ ఆర్థ్ధికశాఖ ఆర్‌టిఐ చట్టం ప్రకారం పాత్రికేయుడికి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొంది. ఎనిమిదేళ్లలోనే విదేశీ అప్పులు రికార్డుస్థాయిలో 83 శాతం వరకూ పెరిగాయని ఆర్థ్ధిక శాఖ ఇచ్చిన వివరాలు స్పష్టం న్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాలు అనేక ఆంక్షలు విధిస్తూ అప్పులిస్తున్నాయి. ఆ దేశాలు వి ధించిన షరతులను గోప్యంగా ఉంచిన కేం ద్రం అన్ని షరతులకు తలొగ్గి నిధులను తెచ్చుకుందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక ప్ర పంచ బ్యాంకు, ఎడిబి, ఐడిఎ, ఒపెక్, ఐబిఆర్‌డిల నుంచి కూడా అప్పులు తెచ్చుకొని కేంద్రం సరికొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఒక్కొక్కరి తలపైన విదేశీ అప్పుల భారం ఏకంగా 5,73,493 రూపాయలు ఉందని వివరించారు. ఇది కేవలం విదేశీ అప్పుల విభాగంలో ఉన్న తలసరి భారమని తెలిపారు.

పరిధులు దాటిన కేంద్రం
‘తప్పులెంచు వారు తన తప్పులెరుగరు’ అన్నట్లుగా… రాష్ట్రాల అప్పులపై అడ్డగోలుగా విమర్శలు చేస్తూ తాను చేస్తున్న అప్పులను మాత్రం సమర్ధించుకొంటున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నట్లుగా ఉందని కొందరు అధికారులు సైతం విమర్శిస్తున్నారు. కేంద్రంలోని కొందరు పెద్దలు బిజెపియేతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడల్లా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆర్ధిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేయడం ఆనవాయితీగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బిజెపి అద్యక్షుడు జె.పి.నడ్డా కూడా రాష్ట్ర అప్పుల గురించి అవాస్తవాలు మాట్లాడారని, నిజాలు తెలుసుకోకుండా నిందారోపణలు చేశారని ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు, ఆ శాఖలోని కొందరు సీనియర్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, తమ రాష్ట్రానికి 2,25,418 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇటీవల రాజ్యసభలో అధికారికంగా ప్రకటించిందని వివరించారు.

2020 మార్చి నెలాఖరు నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పులు కేవలం 23.5 శాతం వరకే పరిమితంగా ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని అతిక్రమించిందని కూడా ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేదని ఆర్‌బిఐ నివేదిక స్పష్టంచేసిందని, 2022-23వ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 23.5 శాతం ఉన్న అప్పులు కాస్తా నవంబర్ నెలాఖరు నాటికి 19 శాతానికి పడిపోయాయని ఆ అధికారులు వివరించారు. ఎందుకంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త రూల్సు పేరుతో తెలంగాణకు రుణాలపై నిధులను సేకరించుకోవడానికి కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేయడంతోనే అప్పుల శాతాలు గణనీయంగా తగ్గాయని ఆ అధికారులు వివరించారు. ఇలాంటి కఠోర వాస్తవాలను తెలుసుకొని విపక్షాల నేతలు మాట్లాడాలని ఆ అధికారులు కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం దేశం యావత్తూ 60 శాతం మాత్రమే అప్పులు చేయాలని, అందులో కేంద్ర ప్రభుత్వం 40 శాతం మేరకు అప్పులు తెచ్చుకోవచ్చునని, మిగిలిన 20 శాతం వరకూ రాష్ట్రాలు అప్పులు చేసుకోవచ్చునని ఆ చట్టం చెబుతోందని వివరించారు. కానీ బిజెపిత రాష్ట్రాలన్నీ సగటున 34 శాతానికి పైగానే అప్పులు చేశాయని తెలిపారు.

బిజెపి పాలిత డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఆర్ధిక ఊబిలో కూరుకుపోలేదా?, బిజెపి రాష్ట్రాలు ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేయలేదా?, అయినప్పటికీ కొత్తగా అప్పులు తెచ్చుకునేందుకు బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఏకపక్షంగా అనుమతులు ఎందుకిస్తున్నట్లు?, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు? ఇది పక్షపాతం కాదా? అని ఆ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి 84 శాతం వరకూ అప్పులు తెచ్చిందని, ప్రస్తుతం దేశం అప్పులు 152,17,910 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయని వివరించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు మాత్రమే ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టానికి లోబడి నడుచుకొంటున్నాయని తెలిపారు. ఇక బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని, ఇలాంటి కఠోర వాస్తవాలను పక్కనబెట్టి కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికే బిజెపి నేతలు సభలు పెడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కనైనా పద్దతులు మార్చుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News