జాతీయ రహదారి వంతెన నిర్మాణానికి 765 కోట్లు
నేషనల్ హైవే అథారిటీకి నిధులు మంజూరు చేసిన నితిన్ గడ్కరి
మనతెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాతీయ రహదారి, వంతెన నిర్మాణానికి 765 కోట్లు మంజూరు చేస్తూ అనుమతి ఇచ్చినట్లు జాతీయ బిసి కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. బుధవారం నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ కెఎల్ఐ పంపులను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం 116 కోట్ల రూపాయలను మంజూరు చేయగా అప్పట్లో ఎదురైన సాంకేతిక పరమైన అంశాలతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం కేంద్రానికి నివేదికను సమర్పించారు. దీంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం సోమశిల సిద్దేశ్వర బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకతను గుర్తించి కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. కల్వకుర్తి నుంచి వయా నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగా సోమశిల వరకు జాతీయ రహదారి, సోమశిల వద్ద గల కృష్ణా నదిపై నుంచి రాయలసీమ ప్రాంతానికి చెందిన సిద్దేశ్వరం వరకు బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇందుకోసం 765 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇందుకోసం పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయనున్నట్లు బిసి కమిషన్ సభ్యులు ఆచారి తెలిపారు.
Centre Govt permission to Somasila Siddeswaram Bridge