మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, న్యాయ విద్య, ఉపాధ్యాయ విద్య, వ్యాయామ విద్య తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, ఇసెట్, ఐసెట్, ఎడ్సెట్,పిజిఇసెట్,పిఇసెట్, లాసెట్,పిజిఎల్సెట్ ప్రవేశ పరీక్షలకు జూన్ 10 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. గతంలో మే 31 వరకు సెట్ల దరఖాస్తు గడువును పొడిగించగా, తాజాగా మరోసారి పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రంలో జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జులై 4న ఇసెట్, జులై 10న లాసెట్, జులై 1 నుంచి 3 వరకు పిజిఇసెట్, జులై 1న పాలిసెట్, 13న ఐసెట్, 15న ఎడ్సెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.