17 మంది నుంచి రూ.20లక్షలు వసూలు చేసిన నిందితుడు
రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తానని బురిడీ
అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఓ వ్యక్తిని నగర నార్త్ జోన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరంలోని ఉప్పుగూడకు చెందిన ఏలగపల్లి రాకేష్ యాదవ్ అలియాస్ శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మేడ్చెల్ జిల్లా, దేవరయాంజల్లోని తిరుమల కాలనీలో ఉంటున్నాడు. తాను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్నానని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి దాదాపుగా 17మంది వద్ద రూ.80,000 నుంచి రూ.1,50,000 వసూలు చేశాడు. బాధితుడు ఎండి జావీద్కు నాంపల్లి వద్ద పరిచయమైన నిందితుడు అతడికి డబుల్ బెడ్ రూము ఇప్పిస్తానని చెప్పి రూ.1,50,000 వసూలు చేశాడు. తనకు రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల కలెక్టరేట్ల పైస్థాయి అధికారులతో పరిచయం ఉందని ఇళ్లను కేటాయింప జేస్తానని చెప్పి బాధితుల నుంచి రూ.20లక్షలు వసూలు చేశాడు.
వారి వద్ద నుంచి ఆధార్ కార్డు, ఫోటో తదితర పేపర్లు తీసుకునేవాడు. వారికి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూముల ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి చూపించేవాడు. వాటని కేటాయించేలా చేస్తానని చెప్పడంతో వారు నమ్మి డబ్బులు ఇచ్చారు. ముందుగా బాధితుల నుంచి టోకెన్ అమౌంట్ కింద రూ.40,000 తీసుకుని నకిలీ ఎస్ఎంఎస్ పంపించేవాడు. తర్వాత ఒక తేదీని నిర్ణయించి డబ్బులు వసూలు చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత ఇళ్ల గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడంతో ఫోన్ నంబర్ మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, పరమేశ్వర్ తదితరులు పట్టుకున్నారు.