హైదరాబాద్: నగరంలోని బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలందిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెక్ పెడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి నాణ్యమైన వైద్యం అందించేందుకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతున్నారు. వర్షకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డయేరియా, కలరా వంటి వ్యాధు లు రాకుండా ప్రారంభంలోనే అడ్డుకట్టవేస్తున్నారు. దవాఖానాల్లో ఇప్పటికే వైద్యసేవలు మంచిగా అందుతుండడంతో రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలో హోమియోపతి వైద్యం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో 123దవాఖానాల ద్వారా రోజుకు 10వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. గత నెలలో మరో 45 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి మరో 5వేల మందికి అదనంగా చికిత్సలు అందిస్తున్నా రు. ఆసుపత్రుల్లో 35రకాల వైద్యపరీక్షలు 150రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
బస్తీ దవాఖానాలకు పెరుగుతన్న ఆదరణ
ఢిల్లీలోని మొహల్లా క్లీనిక్ తరహాలో బస్తీ నివసించే పేదల కు చేరువలో మెరుగైన వైద్యసేవలు అందించే లక్షంతో ప్రభుత్వం గ్రేటర్లో ప్రతి 5వేల నుంచి 10వేల జనాభా కు ఒక చొప్పన ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటివరకు 300 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో దవాఖానాకు రోజుకు 40నుంచి 60మంది వరకు సేవలకు వస్తుండగా, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, గుడ్డిబౌలి, బిజేఆర్నగర్ వంటి బస్తీలో రోజుకు 180 వరకు రోగులు చికిత్సల కోసం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 1451 బస్తీలుండగా, అందులో 987 నోటిఫైడ్, 465 నాన్నోటిఫైడ్ పేదలు నివసించే బస్తీలున్నాయి.
ఇప్పటికే నగర వ్యాప్తంగా 112 పట్టణ ఆరోగ్య కేంద్రాలుండగా, అందులో 96వరకు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. బస్తీదవాఖానాల్లో ఇప్పటివరకు 15 వైద్యపరీక్షలు నిర్వహించి చిన్నపాటి రోగమైతే ఇక్కడే చికిత్స చేస్తారు. దీర్ఘకాలిక, పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటే పెద్దాస్పత్రులకు పంపేవారు. కానీ ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్థానికంగా ఉండే దవాఖానాల్లో ప్రతి జబ్బుకు ఉస్మానియా, గాంధీకి వెళ్లకుండా ఉండేందుకు సిబ్బంది, పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచారు.
మరో 50 దవాఖానాల్లో టెలీమెడిసిన్ సేవలు
బస్తీదవాఖానాల్లో ఇప్పటికే 50 కేంద్రాల్లో టెలీమెడిసిన్ ద్వారా పరీక్షలు నిర్వహస్తున్నారని, త్వరలో మరి కొన్ని బస్తీదవాఖానాల్లో టెలీమెడిసిన్ ద్వారా పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటికితోడు ప్రస్తుతం నిర్వహిస్తున్న 53పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 30 యుహెచ్సిలో సాయంత్రం వేళ ప్రత్యేక క్లీనిక్లను నిర్వహించి వాటికి వివిధ ఆసుపత్రులకు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను రప్పిస్తున్నారు. ఈవినింగ్ క్లీనిక్ సంఖ్య 50కు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పేదలు వైద్యపరీక్షలు చేయించేకునేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Check for Seasonal Diseases in Basti Dawakhana