గల్వాన్ ఘర్షణకు కొన్ని వారాలముందే చైనా పక్కా ప్రణాళిక..
పోరాటం ద్వారానే ప్రాదేశిక సుస్థిరత అంటూ
సైన్యాన్ని ప్రోత్సహించిన ఆ దేశ రక్షణమంత్రి
అమెరికా ఆర్థిక భద్రతా నివేదిక
వాషిగ్టన్: ఈ ఏడాది జూన్లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలకు కొన్ని వారాలముందే చైనా పక్కా ప్రణాళిక రూపొందించిందని అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్(యుఎస్సిసి) తన తాజా నివేదికలో వెల్లడించింది. జూన్ 15 ఘర్షణలకు కొన్ని వారాల ముందు చైనా రక్షణమంత్రి వీ తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రాదేశిక సుస్థిరత కోసం పోరాడక తప్పదని సైన్యానికి సూచించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ భారత్ను హెచ్చరిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో జోక్యం చేసుకుంటే చైనాతో భారత్ వాణిజ్య, ఆర్థిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆ కథనంలో హెచ్చరించింది. అదే క్రమంలో గల్వాన్ సంఘటనకు వారం ముందు చైనా పెద్ద సంఖ్యలో సాయుధ బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్టు ఉపగ్రహ ఛాయా చిత్రాలు వెల్లడించాయి. 1000మంది చైనా సైనికులు గల్వాన్ లోయలో మోహరించినట్టు ఆ చిత్రాల్లో వెల్లడైంది.
వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వెంట లడఖ్ ప్రాంతంలో ఈ ఏడాది మే నుంచి ఇరు దేశాల సైన్యం మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 15న జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతి చెందారు. చైనావైపు జరిగిన ప్రాణ నష్టం గురించి ఆ దేశం దాచిపెట్టింది. 1975 తర్వాత ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణల్లో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి. జపాన్ నుంచి భారత్ వరకు తన పొరుగు దేశాలను బెదిరించడం కోసం కొన్నేళ్లుగా చైనా తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తోందని అమెరికా తన నివేదికలో పేర్కొన్నది. ఎల్ఎసి వెంట మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకోవడం, అమెరికాతో కూటమి కట్టకుండా భారత్ను హెచ్చరించడం చైనా వ్యూహమని ఆ నివేదిక వెల్లడించింది.
China Pre Planning before Galwan Clashes