గత వారం రోజుల్లో వందకు పైగా వెలుగు చూసిన కొత్త కేసులు
40 లక్షల జనాభా ఉన్న నగరం పూర్తిగా మూసివేత
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి చైనాలో మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజలుగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన డ్రాగన్.. మరోసారి ఆంక్షల బాట పట్టింది. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా అనేక స్కూళ్లు, పర్యాటక ప్రాంతాలను మూసి వేసిన చైనా తాజాగా 40 లక్షల జనాభా ఉన్న లాంగ్జువో నగరంలో లాక్డౌన్ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బైటికి రావద్దని గట్టిగా హెచ్చరించింది. చైనాలో గత కొన్ని రోజులుగా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోంది. ఓ వృద్ధ జంట షాంఘైనుంచి పలు ప్రావిన్స్లలో పర్యటించింది. వారిలో కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అధికారులు వారి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. అనంతరం వారితో సన్నిహితంగా మెలగిన వారిని పరీక్షించగా డజన్ల సంఖ్యలో కేసులు బైటపడ్డాయి. ఇప్పటికే 100కు పైగా కొత్త కేసులు బైటపడ్డాయి. గాన్సు ప్రావిన్స్ రాజధాని అయిన లాంగ్జువో నగరంలో సైతం దాదాపు 30 కేసులువెలుగు చూశాయి. దీంతో ఉలికి పడిన చైనా కఠిన అంక్షలను తీసుకు వస్తోంది.
రానున్న రోజుల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచుతున్నామని, దీనివల్ల కొత్త కేసులు మరింతగా పెరిగే అవకాశముందనిఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు వచ్చే ఆదివారం జరగాల్సిన బీజింగ్ మారథాన్ను నిరవధికంగా వాయిదా వేశారు. రేసులో పాల్గొనే వారు. సిబ్బంది, స్థానిక పౌరులను కాపాడేందుకే ఈ రేసును రద్దు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2020లో జరగాల్సిన ఈ మారథాన్ను కరోనా కారణంగా వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా కరోనావైరస్పై పోరులో భాగంగా చాలా దేశాలు వ్యాక్సినేషన్ను విస్తృతంగా చేపట్టడంతో పాటుగా వైరస్తో కలిసి జీవించే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఒక్క కేసు నమోదు అయినా ఆ ప్రాంతాలను మూసి వేసి లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను చేపడుతోంది. మరో వైపు చైనాలో వ్యాక్సిన్ పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.