Friday, April 19, 2024

రెడ్‌ఎకోతో డ్రాగన్ దొంగదెబ్బ

- Advertisement -
- Advertisement -

Chinese cyber campaign targeted India's power grid

 

భారత్ కీలక వ్యవస్థలపై చైనా సైబర్ అటాక్
విద్యుత్, రేవుల సమాచారం తస్కరణ
ఎప్పుడైనా, ఎక్కడైనా తీవ్రనష్టం ?
అమెరికా సైబర్ సంస్థ ‘ఫ్యుచర్’ నివేదిక

న్యూయార్క్ : భారతదేశంలోని విద్యుత్ వ్యవస్థలు, రేవుల వెబ్‌సైట్లలోకి చైనా హాకర్లు చొరబడ్డారు. ఈ విషయాన్ని సైబర్ ఇంటలిజెన్స్ సంస్థ తెలిపింది. చైనా సంబంధిత వ్యక్తులు తమ సైబర్ ఐటి తెలివితేటలతో బలప్రయోగానికి దిగారు. ఈ హాకర్ల బలప్రదర్శనతో వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడి పవర్ సిస్టమ్స్, పోర్టుల నిర్వహణ ప్రక్రియలను విచ్ఛిన్నం చేసే ముప్పు ఉంది. రికార్డెడ్ ఫ్యూచర్ అనే ఈ కంపెనీ భారతదేశపు కీలక వ్యవస్థలకు చైనా సంబంధిత హాకర్ల నుంచి తలెత్తిన సైబర్ చౌర్యం గురించి తెలిపింది. భారతీయ సంబంధిత అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిహద్దుల ప్రతిష్టంభనల దిశలో బెడిసికొడుతూ వస్తున్నాయి. ఇటీవలే రాజీ చర్చల క్రమంలో కొంత మేరకు పరిస్థితి సద్దుమణిగింది.

ఈ దశలో చైనా సంబంధిత సంస్థలు అయిన రెడ్‌ఎకో వంటివి చైనా జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల దిశలో భారత్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. దీని వెనుక చైనా అధికారికంగా సహకరించిందీ లేనిది తెలియదు. ఇది భారతదేశపు ఆంతరంగిక వ్యూహాత్మక భద్రతా కోణంలోకి జరిగిన అతిక్రమణపర్వమే అని ఫ్యుచర్ సంస్థ తెలిపింది. చైనా ఎప్పటికప్పుడూ తన ఆధిపత్య ధోరణిని కాపాడుకునేందుకు ఇతర దేశాలకు చెందిన ప్రధాన వ్యవస్థల గుట్టు రాబట్టుకుంటుందనే వాదన ఉంది. ఈ దశలో ఇప్పుడు జరిగిన సైబర్ అటాక్ , కీలక సమాచారం హాకర్ల పాలుపడేందుకు వీలేర్పడటం వంటి పరిణామాలు అత్యంత కీలకమైనవని అమెరికాకు చెందిన ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

రెడ్‌ఎకో గ్రూప్ తనకు దక్కిన కీలక సమాచారాన్ని ఇతర సంస్థలు అయిన బేరియం, టోంటో టీమ్‌లకు చేరవేసిందని సంస్థ నివేదికలో తెలిపారు. చైనాకు చెందిన కంపెనీలు అనేకం సైబర్ అక్రమాలకు పాల్పడుతున్నాయని గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో చర్యలు తీసుకున్నారు. చెంగ్డూ 404 నెట్‌వర్క్ టెక్నాలజీ సంస్థకు ఇతర సంస్థలకు తమ దేశ భద్రతా కీలక సమాచారం అందించారని పేర్కొంటూ అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం చైనాపై దౌత్యపరమైన చర్యలకు దిగింది. ఇప్పుడు ఈ తరహాలోనే చైనా సంబంధిత సంస్థలు భారత్‌లో సైబర్ దాడికి పాల్పడినట్లు తెలిపారు.

భద్రతా మంత్రిత్వశాఖకు సన్నిహితం

భారత్‌లో సైబర్ దాడికి పాల్పడ్డ కంపెనీలలో ఒకటి చైనా భద్రతా మంత్రిత్వశాఖకు అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ మంత్రిత్వశాఖ తరఫున చైనా ప్రైవేటు కాంట్రాక్టర్లు, ప్రధాన సంస్థల వ్యవహారాలపై నిఘా పెడుతూ వస్తోందని, ఈ వేగు చర్యలతో అందిన సమాచారాన్ని చైనాకు అధికారికంగా నివేదిస్తోందని తెలిపారు. నిజానికి టోంటో టీమ్ నిర్వాహకులకు చైనా సైనిక దళంఅయిన పీపుల్స్ లిబరేషన్‌ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి షెన్‌గ్యాంగ్ సైనిక ప్రాంతీయ సాంకేతిక విషయాల సంస్థతో కూడా లింక్‌లు ఉన్నాయి. భారత్‌లో 10 విద్యుత్ ఉత్పాదన సంస్థలు, పంపిణీ కంపెనీలు, వీటితో పాటు రెండు పోర్టుల కీలక సమాచారం వెల్లడవుతోందని అమెరికా సంస్థ తెలిపింది. తమిళనాడుకు చెందిన రెండు అత్యంత కీలకమైన తూతుకుడిలోని తూతుకూడి ప్రాంతపు విఒ చిదంబరనర్ పోర్టుల సైట్లపై సైబర్ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.

విద్యుత్ ఎల్‌డిసిల విచ్ఛిన్నం?

విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై సైబర్ దాడితో ప్రాంతీయ లోడ్ పంపిణీ కేంద్రాలు (ఎల్‌డిసి)లు ప్రత్యేకించి దక్షిణాది, తూర్పు , పశ్చిమ ప్రాంతాలు, అదే విధంగా తెలంగాణ, ఢిల్లీలోని ఎల్‌సిడిలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. లోడ్ కేంద్రాలు సరిగ్గా ఉంటేనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. లేకపోతే సరఫరాలో లోపాలు తలెత్తి దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. అక్టోబర్‌లో ముంబైలో భారీస్థాయిలో విద్యుత్ సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. థానే జిల్లాలోని పడ్గా లోడ్ డిస్పాచ్ సెంటర్‌లో విద్యుత్ పంపిణీ ట్రిప్పుతో సరఫరా అస్తవ్యస్థం అయింది. అప్పట్లో తలెత్తిన ఈ విద్యుత్ ఆటంకం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్థానిక పత్రికలు కొన్ని ఈ ట్రిప్పింగ్‌వెనుక భారీ స్థాయి కుట్ర ఉందని, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ సంబంధిత మాల్‌వేర్ ఏదో జరిగి ఉంటుందని వార్తలు వెలువరించారు.

కరెంటు షాక్‌తో దెబ్బ

భారతదేశానికి విద్యుత్ పంపిణీ అత్యంత కీలకమైనది. ఇందులో ఎటువంటి లోపాలు ఏర్పడ్డా విద్యుత్ సరఫరాపై ఆధారపడి ఉండే పలు వ్యవస్థలు దెబ్బతింటాయి. దీనితో ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతుంది. భారత్‌తో సరిహద్దులలో సామరస్య స్థాపన అని చెపుతున్న చైనా ఇతరత్రా తన శత్రుత్వాన్ని ఈ విధంగా కీలక వ్యవస్థలపై దాడి రూపంలో ప్రదర్శిస్తూ, తన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటుందని , భారతదేశం ఆద్యంతం జాగ్రత్తగా ఉండాలని అమెరికా సైబర్ టెక్నాలజీ సంస్థ సూచించింది.

ముంబై విద్యుత్ వైఫల్యం సైబర్ దాడితోనే

ముంబై : మహారాష్ట్రలో గత ఏడాది తలెత్తిన విద్యుత్ వైఫల్యానికి సైబర్ దాడి, విద్రోహ చర్యలే కారణం అని రాష్ట్ర ఇంధన వ్యవహారాల మంత్రి నితిన్ రౌత్ తెలి పారు. భారతదేశంలోని విద్యుత్ కేంద్రాలు, పోర్టుల సైట్‌లపై చైనా సంబంధిత సంస్థల సైబర్ అటాక్ వార్త ల నేపథ్యంలో సోమవారం మంత్రి స్పందించారు. సైబర్ దాడి జరిగిందనేది వాస్తవమే అన్పిస్తోందని, ఇది ఓ భారీ స్థాయి కుట్రలో భాగం అని తాము నిర్థారించుకుంటున్నామని తెలిపారు. గత ఏడాది అక్టోబ ర్ 12వ తేదీన ముంబైలో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పంపిణీలో వైఫల్యం తలెత్తి, మహా నగరం ఇతర ప్రాంతాలు అంధకారంలో మునిగా యి. అప్పట్లో కొవిడ్ నియంత్రణ పనులకు ఆటంకా లు ఏర్పడ్డాయి. ఆర్థిక రంగానికి ఇబ్బంది తలెత్తింది. జరిగిన పరిణామం ఏమిటనేదానిపై అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి వివరణ వెలువడలేదు.

అయి తే చైనా నుంచి తలెత్తిన సైబర్ దాడుల వల్లనే విద్యుత్ ఆటంకాలు తలెత్తాయని వార్తలు రావడంతో దీనిపై మంత్రి స్పందించారు. ఇక్కడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ ఆటంకంపై మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎంఇఆర్‌సి), సెంట్ర ల్ ఎలక్ట్రిసిటి అథార్టీలు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశాయి. కారణాలపై ఆరాతీసి తమకు నివేదికలు అందించాయని మంత్రి వివరించారు. ముంబైలో ఇత ర చోట్లా తీవ్రస్థాయి విద్యుత్ లోపానికి సైబర్ అతిక్రమణలే కారణమని కమిటీలు కూడా నిర్థారించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News