“అల వైకుంఠపురములో సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తుందని మొదట చెప్పిన వ్యక్తి చిరంజీవి. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు”అని అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ ‘నాన్ బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ సినిమా ఇంత భారీ కలెక్షన్లను సాధిస్తుందని నేను ఊహించలేదు. ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని నేను నటించాను. ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్బస్టర్ హిట్ చేసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు”అని అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ “కలెక్షన్లు అనేవి ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు కానీ, బన్నీకి కానీ అంకెల బదులు ఎంతమంది ఈ సినిమా చూశారా అనేది ఆనందాన్నిస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఎంతో హ్యాపీగా ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.