హైదరాబాద్: ఎపి సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై గురువారం చిరు ట్వీట్ చేశారు. ”పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది” అని పేర్కొన్నారు. నిన్న ఎపి మంత్రి పేర్ని నాని రాష్ట్ర అసెంబ్లీలో సినిమా ఆన్ లైన్ టికెట్ విధానంపై బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో ఇక నుంచి అన్ని సినిమాలకు ఒకే విధంగా టికెట్ ధరలు ఉండనున్నాయి. అలాగే, రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
Chiranjeevi tweet on AP Cinema Ticket Issue