Thursday, April 18, 2024

1 నుంచి సిటీ బస్సులు?

- Advertisement -
- Advertisement -

అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ సర్వీసుల పునరుద్ధరణ చర్యలు వేగవంతం

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దన్న కేంద్రం అన్‌లాక్ 4.0 ఆదేశాలు దరిమిలా అంతరాష్ట్ర సర్వీసులు పునరుద్ధరణ దిశగా చర్చలు సాగుతూ సత్ఫలితాలనే అందిస్తున్నాయి. మరోవైపు మెట్రో రైలుకు పచ్చజెండా లభించడంతో హైదరాబాద్‌లోనూ సెప్టెంబర్ 1 నుంచి మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కనుంది. దీంతో, హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపేందుకు టిఎస్‌ఆర్టీసి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. సిటీలో సిటీ సర్వీసులు నడవక చిరు ఉద్యోగులు, ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. కరోనా కష్టకాలంలో చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న సగటు చిరు ఉద్యోగి ప్రజా రవాణా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇంటికి సమీపంలో ఉన్నవాళ్లయితే కాలిబాట పడుతున్నప్పటికీ ఇతరత్రా చిరుద్యోగులకు తాము పనిచేసే స్థలానికి వెళ్లడం గగన కుసుమంగానే ఉంది. నిత్యం ఆటో, క్యాబ్‌లలో వెళ్లి రావాలంటే ఇక తాము నెలసరి జీతం ఇంటికి తెచ్చుకునే పరిస్థితి ఉండబోదని సగటు చిరుద్యోగి వాపోతున్న సందర్భాలనేకం. ఈ పరిస్థితుల దృష్టా హైదరాబాద్ సిటీలో సిటి సర్వీసుల పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు, ఇతరుల నుంచి విజ్ఞాపనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ నిబంధనలతోనైనా సరే జీహెచ్‌ఎంసీలో సిటీబస్సులు పునరుద్ధరించాలని కోరుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అప్పట్నించీ ఆర్టీసి అధికారులు సిటీ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నా జీహెచ్‌ఎంసీలో కరోనా విజృంభణ బ్రేక్ వేసింది. ఈ పరిస్థితుల్లో సిటి బస్సులు నడపాలా? వద్దా? అన్న అయోమయ స్థితి నెలకొంటూ వచ్చింది.

అంతరాష్ట్ర సర్వీసులతో పాటు హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనుండటంతో సిటీ బస్సులను సైతం సెప్టెంబర్ మొదటివారంలో రోడ్డెక్కే విధంగా టిఎస్‌ఆర్టీసి వ్యూహరచన చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే సిటీబస్సులు రోడ్డెక్కె విధంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను సైతం ఇందుకు కార్మోన్ముఖులను చేస్తున్నట్లు సమాచారం. కష్టాల కడలిలో వున్న ఆర్టీసి గట్టెక్కాలంటే అటు అంతరాష్ట్ర సర్వీసులతో పాటు ఇటు హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడవాల్సిన అత్యయిక పరిస్థితి ఉంది. సిటీలో రోజు దాదాపు 33 లక్షల మంది ప్రజలు సరాసరిగా ఆర్టీసి బస్సులు ఎక్కుతుంటారు. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో వారంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే పరిస్థితి దాపురించింది. ప్రజాభిమానం చూరగొన్న ఆర్టీసి సేవలను కొనసాగించాలని నేటికి అంతా కోరుకుంటున్నారు. దీంతో సెప్టెంబర్ నుంచే సిటీ బస్సులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీసి అధికారులు సైతం రవాణాశాఖ మంత్రి పువ్వాడతో ఇదే విషయంపై పలు దఫాలుగా చర్చలు కొనసాగిస్తున్నారని వినికిడి. ఈ విషయంపై ప్రభుత్వంకు విన్నవించి తద్వారా నిర్ణయం తీసుకోగలనని మంత్రి పువ్వాడ ఆర్టీసి అధికారులతో అన్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే మాసాల్లో టిఎస్‌ఆర్టీసికి ఎలాంటి ఆదాయం లేదు. ఈ ఏడాది మార్చి 22 నుంచి మే 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఆర్టీసి బస్సులు నడపలేదు. మే 19వ తేదీ నుంచి ఆర్టీసి బస్సులు హైదరాబాద్ మినహా జిల్లాల వ్యాప్తంగా పునరుద్ధరణకు నోచుకున్నాయి. రాష్ట్రంలో పది వేల బస్సులుంటే 30 నుండి 50 శాతం బస్సులు మాత్రమే జిల్లాల్లో నడుపుతున్నారు.

కరోనాకు ముందు రాష్ట్రంలో ఆర్టీసికి ప్రతి రోజూ రూ.12 కోట్ల ఆదాయం గడించేది. ప్రస్తుతం కరోనా విజృంభణతో రోజుకు రూ.2 కోట్ల మేర కూడా ఆదాయం రావడం లేదు. దీంతో టికెట్టేతర ఆదాయంపైనా ఆర్టీసి దృష్టి పెట్టింది. పార్సిల్, కొరియర్, కార్గో సేవలు(పిసిసి) సేవలను సైతం ప్రారంభించింది. ఇంకా ఇతరత్రా టికెట్టేతర ఆదాయాల దిశగా యోచిస్తోంది. సదరు సేవల ద్వారా రోజుకు రూ.15వేలు మాత్రమే ఆర్జించిన టిఎస్‌ఆర్టీసి అనతి కాలంలోనే ఆ సేవల ద్వారా ఏరోజుకారోజు ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రస్తుతం రోజుకు రమారమి రూ.15 లక్షల మేర ఆదాయానికి ఎగబాకింది. మరోవైపు ఆర్టీసి ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రతి నెల రూ.140 కోట్లు వెచ్చించాల్సి ఉంది. జిల్లాల్లో బస్సు సర్వీసుల కంటే అంతరాష్ట్ర, హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడపడం ద్వారానే ఆర్టీసికి ఆదాయ పరంగా లాభం చేకూరుతుంది. కరోనా సమయంలో ఖాళీగా బస్సులను డిపోలకే పరిమితం చేసేకన్నా జిల్లాల్లో బస్సులు తిప్పడమే మేలని టిఎస్‌ఆర్టీసి భావించి ఆ దిశగా బస్సు సర్వీసులను కొనసాగిస్తూ వచ్చింది.

City bus Services resume from Sept 1 in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News