కట్టుబాట్లతో ముగిసిన జి 20
థర్మల్ కేంద్రాలకు బొగ్గు బంద్
గ్లాస్గో సదస్సుకు అస్పష్ట సందేశాలు
ఇటలీలో ముగిసిన సంపన్న భేటీ
స్కాట్లాండ్కు సాగిన ప్రపంచ నేతలు
రోమ్ : వాతావరణ పరిరక్షణ చర్యలకు భరోసా, కట్టుబాటుతనపు హామీలతో రెండు రోజుల జి 20 శిఖరాగ్ర సదస్సు ఇటలీలో ఆదివారం ముగిసింది. ఆదివారం నుంచే స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగే అత్యంత కీలకమైన ఐరాస క్లైమెట్ ఛేంజ్ల సమ్మిట్కు ముందస్తు నేపథ్యంగా జి 20 సదస్సులో వాతావరణ పరిరక్షణ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా వాతావరణ తటస్థీకరణ, కాలుష్యకారక బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు బొగ్గుసాయం కట్టడి వంటి హామీలను జి 20 సదస్సు ముగింపు సభలో వెలువరించారు. ఈ శతాబ్ధపు మధ్యనాటికి కార్బన్ న్యూట్రాలిటిని సాధించితీరాల్సిందే. ఇదే క్రమంలో ఈ లక్షసాధనకు పలు మార్గాలను వినూత్నంగా ఎంచుకోవల్సిందే అని జి 20 సదస్సు పిలుపు నిచ్చింది. ముగింపు తరువాత పూర్తి స్థాయి సంయుక్త ప్రకటనను వెలువరించింది. ప్రత్యేకించి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ప్రజాధనం కేటాయింపులను నిలిపివేయాల్సి ఉంది. వివిధ దేశాలలో క్రమ పద్ధతిలో బొగ్గు వినియోగాన్ని నివారించాలి. అయితే దీనికి సంబంధించి నిర్ణీత గడువు ఏదీ ఖరారు చేయడం లేదని ఈ తీర్మానంలో తెలిపారు.
బొగ్గు మండించడం ద్వారా వెలువడే విద్యుత్ కేంద్రాలతో తలెత్తుతున్న పర్యావరణ వాతావరణ మార్పులను తీవ్రంగా జి 20 సదస్సు పరిగణనలోకి తీసుకుంది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై ఆధారపడి ఉన్న చైనా ఇండియాలకు జి 20 సదస్సు ద్వారా బొగ్గు వాడకం అదుపుపై కాల పరిమితి విధించకపోవడం కీలకమైన పరిణామంఅయింది. అయితే ఈ సదస్సు ద్వారా వాతావరణ పరిరక్షణకు దేశాల ప్రయోజనాలను ప్రాతిపదిక చేసుకోరాదని, నిర్ణీత గడువులను విధించాలనే బ్రిటన్ వాదనకు జి 20 సదస్సు తలొగ్గలేదు. దీనితో బ్రిటన్ ప్రతినిధులు కంగుతిన్నారు. ఐరాస వాతావరణ సదస్సుకు నిర్థిష్ట సంకేతాలను వెలువరించే బాధ్యత జి 20పై ఉందని, ఇటువంటివి లేకుండా అక్కడికి వెళ్లడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే బ్రిటన్ వాదన చెల్లనేరకుండా పోయింది. జి 20 సదస్సులో పాల్గొన్న సభ్యదేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద వాటాను సమిష్టిగా కలిగి ఉంటాయి. ఇదే విధంగా ఈ దేశాలు ప్రపంచ కార్బన్ ఉద్గారాల శాతంలో మూడొంతుల వరకూ వెలువరిస్తూ ఉంటాయి. ఈ దశలో జి 20 సదస్సు నుంచి కార్బన్ ఉద్గారాల నివారణకు సరైన సందేశం వెలువడాలని ఆతిథ్య దేశం ఇటలీ కూడా భావించింది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతతో సతమతమవుతున్న పేద దేశాలకు సాయం అందించడం కూడా కీలక అంశం అని ఇటలీ అభిప్రాయపడింది.
ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన పారిశ్రామిక అవసరాలకు వాడే ఇంధన కోటా ఈ క్రమంలో తలెత్తే వాతావరణపు కాలుష్య అంశాలను కూడా బేరీజు వేసుకోవాలని జి 20 నిర్ణయించింది. ఇటలీ ప్రదాని మేరియో డ్రాఘీ అతిధులుగా వచ్చిన ఇతర ప్రముఖ దేశాధినేతలతో ఇష్టాగోష్టిలో వాతావరణ పరిరక్షణకు దీర్ఘకాలిక లక్షాలను ఖరారు చేసుకోవాలని కోరారు. అయితే వీటిని చేరుకునేందుకు అత్యవసరంగా తీసుకోవల్సిన ఇప్పటి చర్యలను, ఈ క్రమంలో ఖరారు చేసుకునే స్వల్పకాలిక అంశాలను ఎప్పటికప్పుడు తగు విధమైన మార్పులు చేర్పులు చేపట్టాలని సూచించారు.