Thursday, April 25, 2024

దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్

- Advertisement -
- Advertisement -

Jagan

మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్‌లో మీడియాతో ఎపి సిఎం మాట్లాడుతూ.. తెలంగాణలోని ఆంధ్రుల క్షేమంపై సిఎం కెసిఆర్ ఎంతో సానుకూలంగా స్పందించారని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చారని ఎపి సిఎం వివరించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్ల వారు కలిసిన వ్యక్తులను కనుగొనడం చాలా కష్టసాధ్యమని, దీంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుందన్నారు. ఏప్రిల్ 14 వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉంటే వ్యాధిగ్రస్తులను గుర్తించడం చాలా సులభమవుతుందని అలాకాకుండా, అక్కడివాళ్లు ఇక్కడికి, ఇక్కడివాళ్లు అక్కడికి వెళ్లడం వల్ల కరోనా సోకిన వ్యక్తులను గుర్తించడం కష్టమౌతుందన్నారు. దయచేసి ఈ మూడు వారాల పాటు ఎవరూ ఎక్కడికీ వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ ను అరికట్టగలమన్నారు. బుధవారం రాత్రి రాష్ట్రాల సరిహద్దు వరకు వచ్చిన వాళ్లలో 44 మందిని కాదనలేక అనుమతించాల్సి వచ్చిందని, అలాగే ప్రకాశం జిల్లాలోనూ 150 మందిని తప్పనిసరి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో అనుమతిచ్చామన్నారు. వీళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచుతామని వివరించారు. హైదరాబాద్ లో హాస్టళ్లు మూసివేయడంతో వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఎపిలోని స్వస్థలాలకు తిరుగుపయనమైన వారిని తెలంగాణ, ఎపి సరిహద్దు ప్రాంతంలో అధికారులు నిలువరించారన్నారు. వారిని రాష్ట్రంలోకి అనుమతించలేమని స్పష్టం చేశారన్నారు.

దాంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. కరోనా లాంటి వ్యాధులు బహుశా వందేళ్లకోసారి వస్తాయో లేదో కూడా తెలియదని, అసలు ఇలాంటి వ్యాధిని మనం చూడాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. దీన్ని మనం క్రమశిక్షణతోనే గెలవగలమని, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. వివిధ దేశాల్లో కనిపిస్తున్న పరిస్థితులే అందుకు నిదర్శనమని, ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తదుపరి పరిణామాలను ఊహించలేమని, ఈక్రమంలో పొందుగుల, నాగార్జునసాగర్, దాచేపల్లి చెక్ పోస్టుల వద్ద ఇవాళ కూడా అవే పరిస్థితులు కనిపించాయి. ఇప్పటివరకు ఏపీలో 10 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయని, ఇతర దేశాలు, రాష్ట్రాలతో పోల్చితే ఎపి రాష్ట్రంలోని పరిస్థితికి సంతోషించాలన్నారు. దాన్ని ఇలాగే కాపాడుకోవాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని, స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఎంతమంచి వ్యవస్థ ఉన్నా ప్రయోజనం ఉండదన్నారు. కరోనా సోకినా 80.9 శాతం ఇళ్లలో ఉండే నయం చేసుకోవచ్చని, కరోనా బాధితుల్లో కేవలం 14 శాతం మందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతుందన్నారు. అందులో 4.8 శాతం మందికే ఐసియు వైద్య చికిత్సలు అవసరమవుతాయని వివరించారు. 60 ఏళ్లు పైబడిన వారు, బిపి, కిడ్నీ వ్యాధులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎపి సిఎం స్పష్టం చేశారు.

CM Jagan Press Meet over Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News