Thursday, April 25, 2024

పనిచేయకపోతే పదవులూడుతాయ్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

మున్సిపాలిటీలంటే మురికిపాలిటీలనే అప్రతిష్ఠ తొలగించండి
3 నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి
8 నెలల్లో కరెంటు సమస్యలు పరిష్కారం కావాలి
నిధుల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలి
ప్రణాళిక ప్రకారమే ఖర్చుచేయాలి, లేనిపక్షంలో ఎంఎల్‌ఎలు, మేయర్లు, కమిషనర్ల పదవులు ఊడుతాయ్, పల్లె ప్రగతిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు
ఎంఎల్‌ఎలు, కలెక్టర్లు గ్రామాల్లో రాత్రి బస చేయాలి
పేదలు, దళితుల ఆవాసాల నుంచే పాదయాత్రలు ప్రారంభించాలి, ఎస్‌సి, ఎస్‌టి మైనారిటీల ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, వార్డుల వారీగా ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
– ప్రగతిభవన్ సదస్సులో సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : పల్లె ప్రగతి పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించే పాదయాత్రలు, చేపట్టే కార్యక్రమాలు పేదలు ఎక్కువగా ఉండే దళితవాడల నుంచే ప్రారంభించాలని సిఎం కోరారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని కోరారు. వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళి క తయారు చేసుకుని దానికి అనుగుణంగా ప నులు చేసుకుంటూ పోవాలని చెప్పారు. మూ డు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. లేని పక్షంలో సం బంధింత ఎంఎల్‌ఎలు, మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సిఎం హెచ్చరించారు.

నిధుల వినియోగంలో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలని, ప్రణాళిక ప్రకారమే వ్యయం చేయాలని కోరారు. పల్లెప్రగతి కార్యక్రమం సమీక్షించడానికి మండల పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి బస చేయాలన్నారు. గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించడంతో పాటు పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేయాల్సిన పనులపై చర్చించేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సులో సిఎం మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన కార్యక్రమాలను సిఎం దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా -వార్డుల వారీగా ప్రణాళిక తయారు చేయాలని సిఎం సూచించారు. ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తయారు కావాలన్నారు. కౌన్సిలర్/కార్పొరేటర్లను కలుపుకుని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలన్నారు.

ప్రతి వార్డును ఎక్స్‌రే తీయాలి
పురపాలికలలోని ప్రతి వార్డును ఎక్స్ రే తీయాలని సిఎం సూచించారు. అందులో ఏమున్నాయి? ఏమిలేవు? ఏం కావాలి? ఏఏ కార్యక్రమాలు చేయాలి? అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలన్నారు. మంచిపట్టణం నగరం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని సిఎం వ్యాఖ్యానించారు. దానికి సమాధానాలు వెతుక్కుంటే ఏమి చేయాలో బోధ పడుతుందన్నారు. ప్రతి రోజు చెత్తను, మురికిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరిశుభ్రమైన మంచినీరు సరఫరా జరగాలని సిఎం సూచించారు. అలాగే వీధి లైట్లు బాగా వెలగాలన్నారు.

రహదారులపై గుంతలు, బొందలు, గోతులు ఉండకూడదన్నారు. పచ్చదనంతో పట్టణం కళకళలాడాలన్నాపు. చెత్త నిర్మూలనకు ఖచ్చితంగా డంప్ యార్డులు ఉండాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు దహనవాటికలు/ ఖనన వాటికలు సైతం ఉండాల్సిందేనన్నారు. పట్టణ జనాభాను అనుసరించి పరిశుభ్రమైన వెజ్-నాన్ వెజ్- ఫ్రూట్ – ఫ్లవర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లు ఉండాలన్నారు. ఇవీ ఒక మంచి పట్టణం/నగరం లక్షణాలని పేర్కొన్నారు.

3 నెలల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి అవ్వాలి
-ప్రతి పట్టణంలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలు ఏమిటి అని నిర్ధారించుకుని వాటిని కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రజలకు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయిలెట్లు విధిగా నిర్మించాలన్నారు. దీనికోసం ప్రభుత్వ స్థలాలను వినియోగించాలని పేర్కొన్నారు. ఏ శాఖకు చెందిన స్థలమైనా సరే ప్రజోపయోగం వినియోగించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు ఇస్తుందని స్పష్టం చేశారు. ఏ పట్టణానికి ఎన్ని టాయిలెట్లు, ఎక్కడ నిర్మించాలో నిర్ధారించుకుని మూడు నెలల్లో వాటి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. –

స్ట్రీట్ వెండర్స్ జోన్ల ఏర్పాటు
వీధులపై వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్ కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ చేర్పాటు చేయాలన్నారు. వాటిలో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించే వరకు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇస్తుందన్నారు. ఆటోలు, ట్యాక్సీ లు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్క్ చేయడానికి పార్కింగ్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారం కలెక్టర్లకు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

ప్రమాద రహితమైన విద్యుత్ వ్యవస్థ
-ప్రమాద రహితమైన విద్యుత్ వ్యవస్థ కలిగి ఉండాలని సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్ పాత్ లపై ఉండే ట్రాన్స్ ఫారాలను మార్చాలన్నారు. ఇండ్లపై వేలాడే వైర్ల ను యుద్దప్రాతిపదకన సరిచేయాలన్నారు.. పొట్టి స్తంభాల ను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో పెద్ద స్తంభాలు వేయాలన్నారు. ఈ పనులన్ని చేయడానికి అవసరమైన నిధులను ఈసారి బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. ఎంఎల్‌ఎలు, అధికారు లు సమన్వయంతో ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటిని పరిష్కరించాలన్నారు. లేనట్లయితే దానికి ఎంఎల్‌ఎలు బాధ్యత వహించాలన్నారు.

కావాల్సిన పోళ్లను, తీగలను, ట్రాన్స్ ఫారాలను విద్యుత్ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలన్నాపు. పల్లెల్లో స ర్పంచుల మాదిరిగానే పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పెట్టిన మొక్కల్లో 85 శాతం బతికే బాధ్యతను వారు తీసుకోవాలన్నారు. ఆయా పట్టణాలకు అవసమైనన్ని నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణంలో జాగా లే కుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు.

చెత్త సేకరణకు 3100 వాహనాలు
ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీ చేయాలన్నారు. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3100 వాహనాలు తీసుకోవాలని నిర్ణయించామని. ఇప్పటికే 600 వాహనాలు వచ్చాయి. మిగతావి త్వరలోనే వస్తాయన్నారు. ఇంకా అవసరం ఉన్న పట్టణాల్లో మరికొన్ని కొనుగోలు చేయాలని సిఎం ఆదేశించారు. డ్రైనేజీలు శుభ్రం చేయడానికి అనేక రకాల మిషన్లు అందుబాటులోకి వచ్చాయని, వాటిని తక్షణమే సమకూర్చుకోవాలన్నారు.

ప్రతి నెలా రూ.148 కోట్ల నిధులు
పట్టణాలకు ప్రతి నెలా రూ.148 కోట్ల చొప్పున ఆర్థిక సంఘం నిధులు అందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇతర ఖర్చులు తగ్గించుకుని అయినా సరే, గ్రామాల అభివృద్దికి వెచ్చిస్తున్నట్లే, పట్టణాల అభివృద్ధికి నిధులు అందచేస్తామన్నారు. ఈ నిధుల వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. ప్రతి మున్సిపాలిటీ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.. అలాగే తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చును చార్జుడ్ అకౌంటుగా నిర్ధేశించుకోవాలన్నారు.

అప్పులకు సంబంధించిన కిస్తీలు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మంచినీటి బిల్లులు ఖచ్చితంగా ప్రతి నెలా చెల్లించాలని పేర్కొన్నారు. ఇది కమిషనర్ల బాధ్యత అని తెలిపారు. ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడే పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించాలన్నారు. ఎంపి, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల అభివృద్ధి నిధులను కూడా పట్టణాల ప్రగతికి వినియోగించాలన్నారు. – కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం
ఇండ్ల నిర్మాణం, లే అవుట్ విషయంలో సులభతరమైన అనుమతుల విధానం తెచ్చామన్నారు. ప్రజలపై నమ్మకం ఉంచామని, ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. జివో నెంబరు 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే, అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక ప్రణాళికలు
తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎవరికి వారు పూనుకుని తమ ప్రాంతంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలన్నారు. సదస్సులో భాగంగా సిఎం మేయర్లు, చైర్ పర్సన్లతో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్ సత్యనారాయణ, ఎంఎల్‌ఎలు, మేయర్లు, చైర్ పర్సన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

 

CM KCR at Pattana Pragathi Conference
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News