Thursday, April 25, 2024

యువ క్రీడాకారులను సిఎం ప్రోత్సహిస్తున్నారు: సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ యువ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రక్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. మంగళవారం భువనగిరి మండల కేంద్రం లో జరిగిన ‘సిఎం కప్-2023‘ క్రీడా సంబురాలకు సాట్స్ ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి తో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించి ఎంఎల్‌ఎ తో కలిసి కాసేపు వాలీబాల్, కబడ్డీ ఆడి క్రీడా కారులను ప్రోత్సహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎంఆర్ ప్రోత్సాహంతో ప్రణీత్,నిఖత్,త్రిష, శ్రీజ తదితర ఎందరో యువ క్రీడా కారులు ప్రపంచ విజేతలుగా రాణిస్తున్నారని తెలిపారు.

క్రీడా ఆణిముత్యాలకు భారీ నగదు బహుమతులు, విలువైన ఇళ్ళ స్థలాలు ఇచ్చి సిఎం కెసిఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో సిఎం 2023 క్రీడా పోటీలు యువ జాతర్లు గా మారాయని ఆనందం వ్యక్తం చేశారు. క్రీడలు వర్ధిల్లాలనే లక్ష్యం తోనే 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను సిఎం కెసిఆర్ నిర్మించారని, యువత కేర్ టేకర్ మాదిరిగా వాటిని సంరక్షించుకొని,నిత్యం ఆటలతో కళకళలాడేలా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా,ఉద్యోగాలలో క్రీడా కారులకు కల్పించిన రిజర్వేషన్లను విజేతలుగా నిలిచి ఉపయోగించుకోవాలని కోరారు. సిఎం కెసిఆర్ పాలనా చర్యల ఫలితంగా దశాబ్దకాలం లోపే తెలంగాణ నైపుణ్యాల నేలగా మారిపోయింద న్నారు. సాగు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో కేసీఆర్ ప్రభుత్వం స్వల్ప కాలంలో సాధించిన ప్రగతి, ప్రతి కుటుంబానికి ఆసరాగా మారి ఆత్మ విశ్వాసం పెరిగేలా చేసిందన్నారు.

గుడి, బడి లాగే ప్లే గ్రౌండ్స్ ను గౌరవించాలని యువత కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర యువతరం భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిందని, మరో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తో పాటు ఐటీ, పారిశ్రామిక రంగంలో లక్షల ఉద్యోగాలు రాష్ట్ర యువతకు దక్కాయన్నారు. ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కప్ ను చేజిక్కించుకొని భవనగిరి యువత తమ సత్తా చాటాలని ఆకాంక్షించారు. యువత జీవితంలో క్రీడలు కీలకమైనవని ,ఆరోగ్యం తో పాటు గుర్తింపు కూడా క్రీడలతో వస్తుందని వివరించారు. భువనగిరి క్రీడలకు అడ్డా అని, అదే స్పూర్తితో ఆడాలని యువతకు ఎంఎల్‌ఏ పైళ్ల శేఖర్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, డివైఎస్ సిఇఒ, మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్, ఎంపిపి, జెడ్పీటీసీ, వైఎస్ ఎంపిపి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News