Friday, April 19, 2024

చక్రాలకు మళ్లీ చమురు

- Advertisement -
- Advertisement -

CM KCR High Level Review Meeting On TSRTC

ఆర్‌టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం
ఆర్‌టిసిని, విద్యుత్ సంస్థలను
గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో
రావాలని అధికారులకు సిఎం కెసిఆర్
ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో
చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని
వెల్లడి ఛార్జీలు పెంచడమే శరణ్యం
సిఎంకు ఆర్‌టిసి ఉన్నతాధికారుల విజ్ఞప్తి
విద్యుత్ అధికారులది కూడా అదే మాట
ఆర్‌టిసి గాడిలో పడుతున్న సమయంలో
డీజిల్ ధర పెంపు, కరోనా మళ్లీ
దెబ్బతీశాయి అన్ని రకాల చర్యలు
తీసుకొని ఆర్‌టిసి, విద్యుత్ సంస్థలను
ఆదుకుంటాం : ప్రగతిభవన్ సమీక్షలో
ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్‌టిసితో పాటు విద్యుత్ రంగ సంస్థలను గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే మంత్రివర్గ సమావేశానికి తగు ప్రతిపాదనలతో రావాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ సమావేశంలో కూలంకషంగా చర్చించి ఆర్‌టిసి, విద్యుత్ రంగ సంస్థలను ఎలా ఆదుకోవాలన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా నష్టాల్లో ఉన్న కూరకపోయిన ఆర్‌టిసిని గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచడమే శరణ్యమని సంస్థకు చెందిన ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్‌కు విన్నవించగా, విద్యుత్ శాఖ అధికారులు సైతం ఆరేళ్లుగా విద్యుత్ ఛార్జీలను సవరించ లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. నష్టాల్లో కూరుకపోయిన ఆర్‌టిసి, విద్యుత్ రంగ సంస్థలపై తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఆర్‌టిసిపై సమీక్ష చేశారు. కరోనా,- లాక్‌డౌన్‌తో పాటు కేంద్రం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరల కారణంగా ఆర్‌టిసి ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్నదని అధికారులు కెసిఆర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో సంస్థను ఆర్ధిక సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా చైర్మన్, ఎండి, ఉన్నతాధికారులు సిఎంకు విన్నవించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ఆర్‌టిసిని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. కష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం చేశామన్నారు. అయితే గాడిలో పడుతున్నదనుకుంటున్న సమయంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా సంస్థ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్‌టిసిని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో చర్చించి సంస్థకు ఆదాయం సమకూర్చడానికి సంబంధించిన తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

గత సంవత్సరంన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ. 22 రూపాయలు పెరగడం మూలాన ఆర్‌టిసిపై రూ. 550 కోట్లు అదనపు ఆర్ధిక భారం పడుతున్నదని అధికారులు సిఎం కు వివరించారు. డీజిల్ తో పాటు టైర్లు, ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతున్నదన్నారు. వీటన్నిటి ద్వారా మొత్తంగా సాలీనా రూ.600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్‌టిసి మోయవలసి వస్తున్నదని తెలిపారు. కరోనాతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో, సంస్థ పరిస్థితి మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు తయారైందని అధికారులు వాపోయారు. ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ల వల్ల ఆర్‌టిసి సంస్థ సుమారుగా రూ. 3000 కోట్ల ఆదాయాన్ని నష్ట పోయిందని అధికారులు సిఎం కెసీఆర్ కు వివరించారు.
కేవలం హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలుగుతున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ఇటువంటి కష్ట కాలంలో ఆర్‌టిసి చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ.. ఈ నేపథ్యంలో ఆర్‌టిసి చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సిఎం కెసిఆర్‌కు మంత్రితో సహా సంస్థ ఉన్నతాధికారులు విన్నవించుకున్నారు.

గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్‌టిసి చార్జీలను పెంచుతామని ప్రకటిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు సిఎం కు తెలిపారు. ఇప్పటికే, ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతూనే ఆర్‌టిసిని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ వస్తున్నదన్నారు. ఇంకా కూడా ప్రభుత్వం మీదనే అదనపు భారం మోపాలనడానికి తమకు మాటలు రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావంనుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్‌టిసి మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సిఎం కెసిఆర్‌కు స్పష్టం చేశారు. నష్టాల్లోంచి బయటపడేందుకు చార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉన్నదని వారు తెలిపారు. ఆర్‌టిసిని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదన్నారు.

విద్యుత్ ఛార్జీలను పెంచాలని సిఎంకు విజ్ఞప్తి

రాష్ట్రంలో విద్యుత్తు అంశం పై విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి, సిఎండి ప్రభాకార్‌రావులు సిఎం కెసిఆర్‌తో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వారు సిఎంకు వివరించారు. గత ఆరేండ్లుగా విద్యత్ చార్జీలను సవరించలేదని, విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలు పెంచాలని వారు సిఎం కెసిఆర్ కు విన్నవించుకున్నారు. అటు ఆర్‌టిసితో పాటు విద్యుత్ అంశాలకు సంబంధించి రాబోయే కేబినెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సిఎం వారికి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని రవాణా శాఖా మంత్రిని, విద్యుత్ శాఖా మంత్రిని సంబంధిత అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్‌టిసి ఎండి సజ్జనార్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, జెన్ కో అండ్ ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News