Thursday, April 18, 2024

అంబేద్కర్ సచివాలయం.. అమరుల త్యాగఫలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపచేసే దిశగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటుందని సిఎం తెలిపారు. తుది దశకు చేరుకుంటున్న తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ గురువారం పర్యవేక్షించారు. సచివాలయం ప్రధాన ద్వారం దగ్గరు నుంచి పై అంతస్తు వరకు పరిశీలించిన సిఎం కెసిఆర్ వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఉద్దేశ్యాన్ని తనవెంట వచ్చిన ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ వివరించి చెప్పారు.

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వారి అభివృద్ధే లక్ష్యంగా….
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి ఎదరుగా అమర వీరుల స్థూపం నిర్మాణమవుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వారి అభివృద్ధే లక్ష్యంగా, అంబేద్కర్ పేరును సార్థకం చేసే విధంగా, తెలంగాణ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టుకున్నామని ఆయన తెలిపారు. సచివాలయం పక్కనే నిర్మిస్తున్న అత్యంత ఎత్తయిన డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎప్పడికప్పడు తమ కర్తవ్య నిర్వహణను గుర్తు చేస్తూ ఉంటుందన్నారు అమరుల త్యాగాలు, అంబేద్కర్ ఆశయాల స్పూర్తితో, భావి తరాల బంగారు భవిష్యత్తు దిశగా, తెలంగాణ ఉన్నన్నీ రోజులు సచివాలయంలో విధి నిర్వహణ కొనసాగుతుందని సిఎం కెసిఆర్ ఆశాభావాన్ని ప్రకటించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకునే సచివాలయం నిర్మాణం అవుతుందన్నారు.

కలియ తిరిగిన సిఎం
ప్రధాన ద్వారం ఎలివేషన్ సహా, ఇటీవల బిగించిన డోములను, దోల్ పూర్ స్టోన్ తో రూపొందించిన వాల్ క్లాడింగ్ తదితర అలంకరణలను సిఎం కలియ తిరిగి పరిశీలించారు. సచివాలయానికి ఉత్తర దక్షిణ భాగాల్లో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాలను, కాంపౌండ్ వాల్స్ ను, వాటికి అమరుస్తున్న రైలింగులను, వాటర్ ఫౌంటేన్లను, లాన్ లను, స్టేర్ కేస్‌లను సిఎం క్షుణ్ణంగా పరీక్షించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఉన్నతాధికారులు సిబ్బంది సందర్శకుల వాహనాల ప్రవేశ ద్వారాలను పార్కింగు స్థలాలను తుది దశకు చేరుకుంటున్న వాటి నిర్మాణాలను సిఎం పరిశీలించారు.

హెలీప్యాడ్ కోసం స్థలం పరిశీలన
మంత్రుల ఛాంబర్లను వారి సెక్రటరీలు సిబ్బంది కార్యాలయాలను సిఎం పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ, సమర్థవంతంగా గుణాత్మకంగా పనితీరును కనబరిచే విధంగా చాంబర్లు నిర్మితమవుతున్నాయని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. విశాలవంతమైన కారిడార్లను, ఛాంబర్లను పరిశీలించి, మంత్రులు వారి సిబ్బంది ఒకే చోట విధి నిర్వహణ చేసే విధంగా అనుకూలంగా ఉందని సిఎం వివరించారు. క్యాంటీన్లను, సమావేశ మందిరాలను పరిశీలించిన సిఎం తగిన సూచనలు చేశారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా తను సూచించిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని సిఎం నిర్ధారించుకున్నారు. ఇటీవలే బిగించిన డోమ్‌లను పరిశీలించిన ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జీఆర్‌సీ పట్టీలను సిఎం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన సిఎం అనువైన చోట నిర్మాణం చేపట్టాలన్నారు.

అన్ని చోట్లా లిఫ్టుల నిర్మాణం చేపట్టడంపై
అందరికీ అనువైన రీతిలో ఏర్పాటు చేస్తున్న డైనింగ్ హాల్స్, మంత్రులు అధికారులు కలెక్టర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాలను సిఎం పరిశీలించి తగిన సూచనలు చేశారు. సిబ్బందికి సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్ని చోట్లా లిఫ్టుల నిర్మాణం చేపట్టడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలు సహా అడుగడుగునా కదలికలను పసిగట్టే సిసి కెమెరాల ఏర్పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల దిశగా చేపట్టిన చర్యలను, రికార్డులను భద్రపరిచే స్ట్రాంగు రూం లనిర్మాణాలను, జాతీయ అంతర్జాతీయ అతిథులకోసం నిర్మించిన సమావేశ మందిరాలను సిఎం పరిశీలించారు.

దోల్ పూర్ స్టోన్‌ను వాడిన కట్టడం మనదే….
వంద ఏండ్లనుంచి ఇంతపెద్ద మొత్తంలో దోల్ పూర్ స్టోన్‌ను వాడిన కట్టడం దేశంలో తెలంగాణ సచివాలయమేనని అధికారులు సిఎం కు వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలోకూడా ఇంతటి గొప్ప స్థాయిలో సచివాలయ నిర్మాణం జరగలేదని ఆయన తెలిపారు. పార్లమెంట్ తరహాలో నిర్మాణం చేస్తున్న లోపల బయట టెర్రకోటా వాల్ క్లాడింగ్‌ను సిఎం పరిశీలించారు. సిఎం చాంబర్ సహా పలు సమావేశ మందిరాల్లో ఏర్పాటు చేయబోతున్న ఫర్నీచర్ సుందరీకరణ అంతర్గత ఫర్నీచర్ తదితర తుది మెరుగుల అంశాలను నిర్మాణ ఏజెన్సీ ఆర్ అండ్ బీ అధికారులు ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా సిఎం పరిశీలించి తుది ఆదేశాలిచ్చారు.

సిఎం కెసిఆర్ వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క్ సుమన్, దానం నాగేందర్, కంచర్ల భూపాల్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేష్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రియాంకా వర్గీస్, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

CM KCR Inspects Secretariat Construction works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News