గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ
పలు అంశాలపై చర్చ, గవర్నర్ బాబాయి మృతిపై ఆరా
తమిళిసై తండ్రి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
పరామర్శించడానికి వచ్చిన సిఎంకు ట్విట్టర్ వేదికగా గవర్నర్ ధన్యవాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో సిఎం కెసిఆర్ శనివారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ సమావేశాలతో పాటు కరోనా వైరస్ కట్టడి, గవర్నర్ బాబాయి మృతి చెందడంపై ఆమెను పరామర్శించే నిమిత్తం ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్తో భేటీ అయినట్టుగా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు నిబంధనలు అతిక్రమించిన ఆస్పత్రులపై తీసుకున్న చర్యలు తదితర విషయాలను సిఎం కెసిఆర్ గవర్నర్ తమిళిసైతో చర్చించారు.
వచ్చే నెలలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ కోటాలో జరిగే ఎమ్మెల్సీ స్థానాలు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతోపాటు గవర్నర్ తమిళిసై సొంత బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపి వసంతకుమార్ మృతికి సంబంధించిన వివరాలను సిఎం కెసిఆర్ గవర్నర్ను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు గవర్నర్ తండ్రి అనంతన్ సైతం స్వల్ప అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంతో పాటు ఆయన యోగక్షేమాల గురించి కూడా సిఎం కెసిఆర్ గవర్నర్ను అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ పరామర్శపై గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
కన్యాకుమారి ఎంపిగా వసంత్కుమార్
70 సంవత్సరాల వయస్సు గల వసంత్కుమార్ కరోనాతో చెన్నై ఆస్పత్రిలో ఆగష్టు 10వ తేదీన చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వసంత్కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు కన్యాకుమారి లోక్సభ సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
CM KCR Meeting with Governor Tamilisai