Friday, April 26, 2024

భూ యాజమాన్య హక్కులకు మోకా మైనా

- Advertisement -
- Advertisement -

CM KCR Review Meeting on Agriculture

 

రైతులకు చిన్నచిన్న సమస్యలున్న చోట స్పాట్ ఎంక్వైరీ
పరిష్కారమైన వెంటనే రైతుబంధు సాయం
చిట్టచివరి రైతునూ గుర్తించి సాయం అందించండి
విత్తనాల నిల్వకు రూ.25కోట్లతో భారీ అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఏడాదిలోగా కట్టడం పూర్తి
దసరా నాటికి రైతువేదికల నిర్మాణం
నియంత్రిత పద్ధ్దతిలో వానాకాలం సాగు శుభసూచకం
వ్యవసాయంపై ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష

మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డులే లేవు, ఆ జిల్లాకు చెందిన మంత్రి చొరవతో మొత్తం గ్రామంలో సర్వే జరిపాం. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించాం. మిగతా చోట్ల కూడా అదే జరగాలి. తద్వారా రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలి. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదు. చివరి రైతుకూ సాయం అందే వరకు విశ్రమించొద్దు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు అందలేదని అనొద్దు. ఇప్పటి వరకు 99.9శాతం మంది రైతులకు సాయం అందింది.

తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన మేలురకం విత్తనాల తయారీని వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. ఆ విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్ స్టోరేజీని నిర్మించాలి. నిధులను కూడా వెంటనే విడుదల చేస్తాం. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి.

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతు లు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండ డం శుభసూచకమని, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని సిఎం అన్నారు. సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడరన్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుబంధు

సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రగ తి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభు త్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, రామకృష్ణ రావు, నర్సింగ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విజయ్ కుమార్, డిడిఎ శైల జ, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎ ం కెసిఆర్ మాట్లాడుతూ, కరోనా కష్టకాలం లో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండ గా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసిందన్నారు.

అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సా యం అందించారని ప్రశంసించారు. ఇప్ప టి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందన్నారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలన్నారు. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయం అందించాలని సూచించారు. మంత్రులు తమ జిల్లాలో, శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. కాస్తు లో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు.

అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలన్నారు. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హ క్కులు కల్పించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నా రు. అందరి సమస్యలు పరిష్కరించి… అందరికీ సాయం అందించాలని సూచించారు. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ఒక సారి సమస్య పరిష్కారం అయిపోతే ఇక ఎప్పటికీ గొడవ ఉండదన్నారు. అది అన్ని తీర్లా మంచిదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించడం జరిగిందని, మిగతా చోట్ల కూడా అదే జరగాలని సిఎం కోరారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదు…. చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దు అని సూచించారు. వందకు వంద శాతం రైతులందరికీ సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనవద్దు అని సిఎం స్పష్టం చేశారు. రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే తనకు నివేదిక సమర్పించాలని సిఎం ఆదేశించారు. క్లస్టర్ల వారీగా ఎంఇఒల నుంచి నివేదికలు తెప్పించాలన్నారు.

అలాగే రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలని పేర్కొన్నారు. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలని సిఎం ఆదేశించారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందని సిఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారన్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. ఇది గొప్ప పరివర్తనగా ఆయన అభివర్ణించారు. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామమన్నారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందన్నారు. ఇది శుభసూచకమని, తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సిఎం అన్నారు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్పూర్తినిస్తున్నదని, రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నదని కెసిఆర్ ప్రకటించారు.

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం తెలిపారు. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయన్నారు. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలన్నారు. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయని సిఎం కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నదని…. అందులో భాగంగా పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాయన్నారు. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి కావాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల అవుతాయని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని సిఎం చెప్పారు.

CM KCR Review Meeting on Agriculture

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News