Saturday, April 20, 2024

రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు

- Advertisement -
- Advertisement -

CM KCR

 

అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి… దాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న పంటలే వేయాలి. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతుంది. ఆ పంటలకే మద్దతు ధర ఇస్తాం. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకు. వాళ్ల ఆలోచనలో మార్పు రావాలి.
ఈ వానాకాలం వరి పంటతోనే అమలు
చెప్పినట్టు సాగుజేసినోళ్లకే రైతుబంధు
పంట మార్పిడి, క్రాప్ కాలనీలపై 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
వచ్చే సీజన్‌లో 50 లక్షల ఎకరాల్లో వరి, ఇందులో 10 లక్షల ఎకరాల్లో సన్న బియ్యం
మరో 50 లక్షల ఎకరాల్లో పత్తి,
10 లక్షల ఎకరాల్లో కందులు
ఏ పంట ఎక్కడ, ఎంత అనేది త్వరలో వెల్లడి
సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ, కల్తీ, నకిలీ విత్తన వ్యాపారులపై పిడి యాక్ట్
– సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్ర భుత్వం సూచించిన పంటలనే రైతు లు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరిపంట సాగు ఈ వ ర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను చర్చించే ందుకు ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడాలని సిఎం నిర్ణయించారు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటెల రాజేందర్, ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వి నోద్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, బి.జనార్థన్ రెడ్డి, రామకృష్ణరావు, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, హార్టికల్చర్ కార్పొరేషన్ ఎండి వెంకట్రామ్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, ఉప సంచాలకులు శైలజ, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే నానుడి రాష్ట్రంలో, దేశంలో ఎప్పటి నుంచో ఉందన్నారు. పండించిన పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు….కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు ఉంటాయన్నారు. సేవారంగం, ఐటి రంగం, కొత్త వృత్తులు ఈ మధ్య వచ్చినవన్నారు. గతంలో అంతా వ్యవసాయమేనని, నేరుగా పంటలు పండించే రైతులు, అందులో పనిచేసే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉండే వారని సిఎం పేర్కొన్నారు. ఇలా సమాజంలో 90- నుంచి 95 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వారేన్నారు. మన రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం, దేశం వ్యవసాయక దేశమన్నారు. మన దేశంలో ఒకప్పుడు తీవ్రమైన కరువు ఉండేదని, కీలకనామ సంవత్సరంలో అయితే విపరీతమైన ఆహార కొరత కూడా ఏర్పడిందని సిఎం అన్నారు. తొండల్లాగా బతకాల్సి వచ్చిందన్నారు. ఈ తర్వాత అనేక పరిణామాలు మారాయని, వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

పంటలకు గౌరవ ప్రదమైన ధరలు రావాలి

రైతు పండించిన పంటకు మంచి ధర రావడం లేదని సిఎం అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతులు పండి ంచిన పంటలకు గౌరవ ప్రదమైన ధరలు రావాలంటే ఏం జరగాలి? అని మనం ఆలోచించుకోవాలన్నారు. గతం మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక వహించి మౌనంగా ఉండా లా? మార్పు కోసం ప్రయత్నించాలా? దురదృష్టం కొద్దీ ఇప్పటివరకు భారతదేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవసాయంపై చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితిలో మార్పు తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది.. చేస్తున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో వ్యవసాయం పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నదన్నారు.

రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి

రాష్ట్రంలో కరెంటు గండం గట్టెక్కిందని, సాహసోపేతంగా తలపెట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయని అన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ సారి ప్రభుత్వం మొత్తం పంటను కొనుగోలు చేస్తున్నదన్నారు. దేశం మొత్తం కరోనా ఉన్నప్పటకీ మరే రాష్ట్రంలో ఇలా మొత్తం పంటను కొనుగోలు చేయడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇది తెలంగాణ ప్రత్యేకత. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్నదన్నారు. ప్రపంచమే తెలంగాణ నుంచి నేర్చుకోవాలని అభిలాషిస్తున్నదని సిఎం కెసిఆర్ అన్నారు.

వరి పంటతోనే మార్పు ప్రారంభం

ఈ వర్షాకాలంలో వరి పంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని ఈ సమీక్షలో సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నారు. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందన్నారు. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయం జరిగిందన్నారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని నిర్ణయించామని తెలిపారు. ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండించాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారన్నారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏ ప్రాంతంలో ఎంత మేరకు కూరగాయలు పండించాలి? ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు ప్రభుత్వం సూచిస్తుందన్నారు.

సీడ్ రెగ్యులేటింగ్ అథారిటి ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే విక్రయిస్తారన్నారు. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని సిఎ కెసిఆర్ తెలిపారు. అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీడ్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.

కల్తీ, నకిలీలపై ఉక్కుపాదం

నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం తెలిపారు. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించిందన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టాయన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని వెంటనే గుర్తించి, పిడి యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు. . ముఖ్యంగా పత్తి, మిరప విత్తనాలు నకిలీవి ఎక్కువగా అమ్మే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వాటి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. –

15న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధానంపై చర్చించేందుకు, తగు సూచనలు చేసేందుకు ఈ నెల 15న మద్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఎడిఎ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఎఇవోలు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు, గ్రామాల రైతు బంధు సమితిల అధ్యక్షులు పాల్గొంటారు.

వ్యవసాయ శాఖను పునర్వవస్థీకరిస్తాం

సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించామని సిఎం కెసిఆర్ తెలిపారు. వ్యవసాయ యూనివర్సిటీలో తెలంగాణలో పండించాల్సిన పంటలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించామన్నారు. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో రైతులను సమన్వయ పరచాలన్నారు. రాష్ట్రంలో గోదాముల నిర్వహణ అంతా సులభంగా, ఏకోన్ముఖంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మార్కెటింగ్ శాఖను కూడా తెలంగాణలో అమలయ్యే వ్యవసాయ విధానానికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పండుతోందని, ఆ వరిని బియ్యంగా మార్చ డం కోసం రాష్ట్రంలో రైసు మిల్లుల సామర్ధ్యం బాగా పెరగాల్సి ఉందన్నారు. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు. –

ఒకే పంట వేసే విధానం పోవాలి

రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడమేనని సిఎం కెసిఆర్ అన్నారు. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని తాను ఇవాళ చెప్పడం లేదన్నారు. గత 20 ఏళ్ల క్రితం నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెబుతున్నానని అన్నారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడికి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పానని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. ఇంతకు మించిన గత్యంతరం లేదన్నారు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలని సిఎం అన్నారు. ఏది పడితే అది పండించి… ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేయవద్దని సూచించారు.

పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరన్నారు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు అని…. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని సిఎం సూచించారు. అమ్ముడుపోయే సరుకే పండించాలన్నారు. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతున్నదన్నారు. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెబుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలని ప్రశ్నించారు. రైతుల ఆలోచనలో మార్పు రావాలి. నిర్మాణాత్మకమైన మార్పులు రావాలని సిఎం కెసిఆర్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News