Friday, April 19, 2024

మాంద్యం నీడలో బడ్జెట్‌పై మథనం

- Advertisement -
- Advertisement -

CM KCR

 

గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం?

పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్
కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు
ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,
సంక్షేమాలకు అధికంగా కేటాయించే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం(2020…..-2021) బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు మొదలు పెట్టింది. గురువారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సంబంధిత ఉన్నతాధికారులతో గంటల తరబడి బడ్జెట్ విషయమై సమీక్షించారు. మార్చి రెండో వారంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా ఈ సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019…2020)లో మాంద్యం వల్ల పన్ను రాబడులు తగ్గిన నేపథ్యంలో రాబోయే ఏడాదిలో దాని ప్రభావం ఏ మేరకు ఉంటున్న అంశంపై అధికారులతో సిఎం చర్చించినట్లు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఈ కొత్త బడ్జెట్ నుంచే అమలులోకి వస్తుండడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా(డివల్యూషన్)లో ఎంత తగ్గుతుంది? ఇతర కేంద్ర పథకాల్లో కేంద్రం నుంచి ఎంత వస్తుందనే అంచనాలపైనా సిఎం ఈ సందర్భంగా ఆరా తీశారు.

కేంద్ర పన్నుల వాటా తగ్గనున్న నేపథ్యంలో రాష్ట్రం సొంత పన్నుల రాబడి(ఎస్‌ఒఆర్) మీదే ఆధారపడాల్సి ఉండడంతో వాటి రాబడి వచ్చే ఏడాదిలో ఎలా ఉంటున్నదానిపైనా చర్చించారు. ఇప్పటికే మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల పెరిగిన ఆదాయం, త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం వల్ల ఎంత మేర ఎస్‌ఒఆర్ పెరుగుతుందన్నదానిపైనా చర్చించారు. మాంద్యం ఎఫెక్ట్, కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గనున్న నేపథ్యంలో గత సంవత్సరం ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ లక్షా 46 వేల కోట్లకు అదనంగా 10 శాతం నుంచి 12 శాతం పెంపుతో లక్షా 60 వేల కోట్లకు ఈ బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్నదానిపై కూడా సమాలోచనలు జరిపారు. ఇక ఈసారి బడ్జెట్‌లో ఏఏ శాఖలకు, ప్రభుత్వ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించాలన్న దానిపై ఇప్పటికే అన్ని శాఖల నుంచి తెప్పించుకున్న ప్రతిపాదనలపైనా సుదీర్ఘంగా చర్చించారు.

ఎప్పటిలాగే ఇరిగేషన్, పవర్, అగ్రికల్చర్, సంక్షేమ శాఖలకు అధికభాగం నిధులు కేటాయించాలని సిఎం అధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే శాఖల వారీగా కేంద్రం నుంచి వచ్చే నిధులపై లెక్కలు తీస్తున్నారు. ఈసారి కూడా వాస్తవిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాలని సిఎం భావిస్తున్నారు. బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేసి అబాసుపాలు కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

కాగా ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు భూములను విక్రయించాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భూముల విక్రయాలతో 2020…20–21బడ్జెట్‌లో సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయంగా చూపించనున్నట్లుగా తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం 2019…20–20 బడ్జెట్ లో కూడా భూములను అమ్మితే రూ. 10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కానీ ఆ భూములపై కోర్టుల్లో కేసులు ఉండటంతో వాయిదా వేశారు. దీంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో మాత్రం కచ్చితంగా భూములను అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్ శివారులోని కోకాపేట సమీపంలో సుమారు 100 ఎకరాల భూమి ఉంది. దాన్ని అమ్మితే సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయం వచ్చే వస్తుందని ఇప్పటికే సంబంధిత అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ వసూళ్లు రూ. లక్షా 30వేల కోట్లు 2019…..20–20 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వసూళ్లు రూ. లక్షా 30 వేల కోట్లకు చేరవచ్చునని కూడా సమావేశంలో అంచానా వేసినట్లుగా తెలుస్తోంది. కాగా గత డిసెంబర్ చివరి నాటికి రెవెన్యూ వసూళ్లు రూ. 71187.09 కోట్లు వచ్చాయి. మిగతా మూడు నెలలకు కలిపి రూ. 35 నుంచి 40 వేల కోట్లు వరకు రెవెన్యూ వసూళ్లు ఉండే అవకాశం ఉందని సమీక్షలో సిఎం కెసిఆర్‌కు అధికారులు వివరించారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల హామీలపైనా చర్చ
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలపై కూడా బడ్జెట్ సమీక్షలో చర్చ మొదలైనట్లుగా సమాచారం. లక్షరూపాయల వరకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు ఇప్పటికి మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ దఫా పలు కీలక శాఖలకు అధికంగా నిధులను కేటాయించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఎం కెసిఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ బడ్జెట్ కసరత్తులో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావుతో పాటు పలువురు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

CM KCR review on the Budget
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News