Tuesday, April 16, 2024

‘జల’వనరుల పాలన

- Advertisement -
- Advertisement -

19 ప్రాదేశిక ప్రాంతాలు, బాధ్యులుగా చీఫ్ ఇంజినీర్‌లు
 ఆ పరిధిలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడిసి లిఫ్టులు, బ్యారేజిలు, పంపుహౌజ్‌లు, కాలువలు, సబ్‌స్టేషన్‌లు అన్నీ సిఇ పరిధిలోకే…
నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ
రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీటి వసతులు బాగా పెరిగాయి
ఘనపూర్ ఆనికట్‌కు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం
పాకాల కాల్వల పునరుద్ధరణ, సత్వరమే అంచనాలు
ఒకే విభాగంగా జలవనరుల శాఖ
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాలు
CM KCR Review on Water Resources Department

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రస్తుతం సాగునీటి వసతులు బాగా పెరిగాయని సిఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున…. పనిభారం కూడా పెరిగిందని పేర్కొన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జల వనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై మంగళవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే, వాటి సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సిఇ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడిసి లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌజులు, కాలువలు, సబ్ స్టేషన్లు అన్ని సిఇ పరిధి కిందికే వస్తాయన్నారు. గతంలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతున్నదన్నారు.

మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనికట్‌కు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. పాఖాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని సమావేశంలో పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సిఎం… కాకతీయులు నిర్మించిన పాఖాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమే అన్నారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
సమావేశంలో మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్, సిఎం ఒఎస్ శ్రీధర్ దేశ్ పాండే, సి బి.నాగేందర్ రావు, డిప్యూటి ఇఎన్‌సి అనిత, డిడిఎ చందర్ రావు, ఎస్‌ఇ ఆర్.కోటేశ్వర్ రావు, ఇఇలు కె. ప్రసాద్, ఎస్. విజయ్ కుమార్, డిఇఇ వెంకట నారాయణ, ఎఇఇ శివ కుమార్, కెపిఎంఎ రత్నం తదితరులు పాల్గొన్నారు.

CM KCR Review on Water Resources Department

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News