హైదరాబాద్లో డివిజన్కు రెండు వంతున, బలహీనవర్గాల కాలనీల్లో విరివిరిగా, నెల రోజుల్లో ఏర్పాటుకు సిఎం ఆదేశాలు
హైదరాబాద్ : బస్తీ దవాఖానాలను పెంచి పేద ప్రజలకు వైద్య సేవలను మరింతగా అందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలో డివిజన్కు రెండు చొప్పున 350 వరకు పెంచాలన సిఎం చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో వైద్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 118 బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలు వీటితో ఎంతో సంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. వీటి సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లలో ప్రతి డివిజన్లో రెండు బస్తీదవాఖానాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సి, ఎస్టి, మైనార్టీలు, పేదలు నివసించే బస్తీలు, కాలనీల్లో మరిన్ని ఎక్కువ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాబోయే నెల రోజుల్లోనే కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. బస్తీ దవాఖానాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
జిల్లాల నుంచి ప్రతి ఏడాది 6 లక్షల నుంచి 7 లక్షల వరకు నగరానికి బ్రతుకుదెరువు కోసం వస్తున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీదవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిల్లో వైద్యం చేయించుకునే స్థోమత వలస వస్తున్నవారికి లేకపోవడంతో మృతిచెందుతున్నారని, వారికి బస్తీ దవాఖానాల్లో ఆధునిక వైద్యం అందుతోందని పేర్కొన్నారు. అన్ని రకాల రోగాలకు వీటిల్లో వైద్య సదుపాయాలు ఉండేలా చూడాలని చెప్పారు.