Saturday, April 20, 2024

కెలికి కయ్యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి అర్థంపర్థంలేని రాద్ధాంతం
రాష్ట్రం హక్కులపై కేంద్రానిది తప్పుడు విధానం

త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్‌లోఆంధ్రప్రదేశ్ నోరు మూయించాలి
రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం స్నేహహస్తం అందించాం
బేసిన్లు, బేషజాలు వద్దని స్పష్టంగా చెప్పా, రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే గోదావరి, కృష్ణ బేసిన్లలో ప్రాజెక్టుల నిర్మాణం
తెలంగాణ నీటి వాటా ప్రకారమే రీడిజైన్ చేసి నిర్మించుకుంటున్నాం
ఇప్పుడు వాటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం
కేంద్రం అనుమతులు ఇవ్వడం వల్లే రూ. 23వేల కోట్లు ఖర్చు చేశాం
అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR slams AP Govt over Krishna water dispute

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థ వంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎపి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షున్నంగా పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై కూడా చర్చించారు. “నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాము. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాము. వృధాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము.

అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నదని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నదని మండిపడ్డారు. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతామన్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు సైతం వచ్చాయన్నారు. పెద్దఎత్తున ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో ఎపి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని సిఎం అన్నారు.

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలన్నారు. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు… అది జల విద్యుత్ ప్రాజెక్టు అని తెలిపారు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. దీనిపై ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తనకున్న హక్కు ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తామన్నారు. దీనిపై త్వరలో అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.

తప్పుడు వైఖరి

తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరీ తప్పిదమే. రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు సైతం వచ్చాయి. పెద్దఎత్తున ఖర్చు కూడా జరిగింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతోంది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం నీటి పారుదల ప్రాజెక్టు కాదు… అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఈ విషయం లో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. దీనిపై త్వరలో అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం.

గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరై ఉన్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. వాటికి నీటి కేటాయింపులు కూజా జరిగాయన్నారు. సిడబ్ల్యుసి సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు కూడా వచ్చాయని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అనుమతులు రావడం వల్లే దాదాపు రూ.23 వేల కోట్ల వరకు నిధుల ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 31,500 ఎకరాల భూ సేకరణ జరిగిందని తెలిపారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థ రహితం… అవివేకమని సిఎం అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంజూరయినప్పటికీ వాటిని పూర్తి చేయలేదని… పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారన్నారు. దీని వల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవన్నారు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదని…. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీడిజైన్ చేసి నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీన్ని తప్పు పట్టడంలో అర్థం లేదన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి… ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడం లేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్-ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మ సాగర్ ను నిర్మిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. పెన్ గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని సిఎం అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించిందన్నారు. దీంతో ఈ రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగిందన్నారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదని సిఎం కెసిఆర్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తామని సిఎం వెల్లడించారు.
మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని.. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం మంచినీటి కోసం వాడే 110 టిఎంసిలలో 22 టిఎంసిలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని సిఎం పేర్కొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోందన్నారు. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల చాలా అన్యాయం జరిగిందన్నారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయన్నారు. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్నదన్నారు.

పిలిచి పీటేస్తే..

నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించా. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృధాగా సముద్రం పాలు అవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నా. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని
వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించిందని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగామన్నారు. ఆర్‌డిఎస్ తూములను ఆంధ్ర ప్రాంత శాససనభ్యులు బాంబులు పెట్టి పేల్చితే గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదన్నారు. ఆర్‌డిఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగిందని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉందన్నారు. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టిఎంసిలు దక్కాల్సి ఉందన్నారు. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్ మెంటు ఏరియా ఎక్కువ అని… నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ అని సిఎం తెలిపారు. తెలంగాణకు అవసరాలు కూడా ఉన్నాయని, సముద్రంలో కలిసే రెండు వేల టిఎంసిలలో తెలంగాణకు కనీసం వెయ్యి టిఎంసిలు కేటాయించాలని ఈ సందర్భంగా సిఎం కేంద్రాన్ని కోరారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, సిఎంఒ కార్యదర్శి స్మితా సభర్వాల్, సిఎం ఒఎస్‌డి డి. శ్రీధర్ దేశ్‌పాండే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి, ఎంఎల్‌ఎ సురేందర్, ఇఎన్‌సి నాగేందర్‌రావు, డిప్యూటీ ఇఎన్‌సి అనిత, డిడిఎ చందర్‌రావు, ఎస్‌ఇ కోటేశ్వర్‌రావు, ఇఇలు ప్రసాద్, విజయ్‌కుమార్, డిఇఇ వెంకట నారాయణ, అడ్వకేట్ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

CM KCR slams AP Govt over Krishna water dispute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News