సమస్యల పరిష్కారం,
సంక్షేమంపై చర్చించే అవకాశం
ఉద్యోగ సంఘాల 18 డిమాండ్లు,
ఉపాధ్యాయుల 34 కోర్కెలు
ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం
హైదరాబాద్: వివిధ (ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, ఆర్టీసీ, తదితర) ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం కెసిఆర్ రేపు ప్రగతిభవన్లో భేటీ కానున్నట్టుగా తెలిసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు వారి సంక్షేమం కోసం అనేక విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సాధకబాధలను తెలుసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. వేతనాల పెంపుతో పాటు పదవీ విరమణ వయో పరిమితి పెంపు వంటి కీలక అంశాలను ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. గతంలో 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వగా ఈసారి 63 శాతం ఫిట్మెంట్ను ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారితో దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి 18 డిమాండ్లు రాగా, ఉపాధ్యాయ సంఘాల నుంచి 34 డిమాండ్లు గతంలో మంత్రివర్గ ఉపసంఘానికి వచ్చాయి. వీటిపై ప్రధానంగా సిఎం కెసిఆర్ చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన డిమాండ్లలో కొన్ని…
సిసిఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలి. నూతన పిఆర్సి వెంటనే అమలు చేయాలి. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి బదిలీల ప్రక్రియలను చేపట్టాలి. ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలి. ఆర్డర్ టు సర్వ్ను రద్దు చేయాలి. పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలి. జిల్లా గ్రంథాలయ, మార్కెట్ కమిటీ, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలను చెల్లించాలి. పదోన్నతుల కోసం మూడు సంవత్సరాల వ్యవధికి బదులు రెండు సంవత్సరాలు తగ్గించాలి. పింఛనర్ల సమస్యలను పరిష్కరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలి. సమానపనికి సమాన వేతనాన్ని చెల్లించాలి. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. హెల్త్ కార్డులను మరింత పకడ్భందీగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలు చేయాలి. ఉపాధ్యాయ సమస్యలను ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమలు చేయాలి. పండితులు, పిఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి.