Thursday, March 28, 2024

అపర వైకుంఠంగా

- Advertisement -
- Advertisement -

మేలో యాదాద్రి పునఃప్రారంభం

పరిశుభ్రతలో దేశంలోనిగుడులన్నిటికీ ఆదర్శంగా ఉండాలి

ముందుగా బాలాలయంలో పూజలు, అనంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ
ఆలయ ప్రాంగణంలో పరిసరాల్లో జరుగుతున్న పనుల పరిశీలన
ఏమేమి జరుగుతన్నాయి, ఎన్ని రోజుల్లో పూర్తిఅవుతాయి అని ఆరా
మాడ వీధులు, క్యూ లైన్, ప్రాకార మండపాలు తదితరాల పరిశీలన
వాటిని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు సూచనలు, అభిషేక సమయంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించాలి
ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు తొలగించాలని ఆదేశాలు 
రెయిలింగ్ పనులకు, శివాలయంలో మండపం నిర్మాణానికి ప్రశంసలు
గెస్ట్‌హౌస్ లిఫ్ట్‌లు పూర్తి కాకపోవడంపట్ల అసంతృప్తి
పూరి ఆలయంలో మాదిరిగా పేద బ్రహ్మణ పెద్దలు భక్తుల నుంచి కానుకలు స్వీకరించడానికి మండపం ఏర్పాటు చేయాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్/యాదాద్రి: సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దివ్యక్షేత్రాన్ని మే నెలలో పున:ప్రారంభం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా, దాదాపు పూర్తి కావస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకుపైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం పరిసరాల్లో అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చే రుకున్న సిఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి? అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయ ప్రాంగణంలో కలియదిరిగిన సిఎం కెసిఆర్, మాడ వీధులు, క్యూలైన్ , ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లు, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నాన గుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణ పనులను పరిశీలించారు. వీటిని మరింత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు సిఎం పలు సూచనలు చేశారు. అలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం(ఆర్ణమెంటల్ లుక్కు)తో ఉండేలా, బ్రాస్ మెటల్ తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తి భావన ఉట్టి పడేలా దీపాలంకరణ ఉండాలన్నారు.

దేవాలయ ముందుభాగం కనుచూపు మేర నుంచి చూసినా అత్యద్భుతంగా ఉండేలా తీర్చి దిద్దాలని, ప్రాచీనత, నవ్యతతోపాటు దైవ సందర్శకులకు, భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని కోరారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యంలో దేశం లోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా, నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలంకరించాలన్నారు. ప్రహరీని ఆనుకుని ఉండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూ లైన్ దారిని నిర్మించాలని కోరారు. మూల విరాట్టుకు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సిఎం సూచించారు. గర్భగుడి ముందరి ధ్వజస్థంభాన్ని హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూర్ పెయింటింగులను ఆయన పరిశీలించారు. అనంతరం నృసింహ స్వామి గర్భగుడిలో సిఎం ప్రత్యేకంగా పూజలు చేశారు. బంగారు తాపడం చేసిన పలు దేవతా మూర్తులను పరిశీలించారు. ఆండాళ్ ఆల్వార్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. మూలవిరాట్ దైవ దర్శనానంతరమే క్షేత్రపాలకుని దర్శనం ఆనవాయితీగా వస్తున్నదని దానినే కొనసాగించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ సూచించారు. అత్యద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నపుడు హడావిడి పడకూడదన్నారు. తిరుపతి లాగా, స్వామి వారికి సేవలందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారని, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా ప్రభుత్వం యాదాద్రిని తీర్చిదిద్దుతున్నదన్నారు.
ఇతర దేవాలయాలకు ఆదర్శంగా….


స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో యాదాద్రి దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా ఉండాలని, ఇందుకోసం అవసరమైన మేరకు ఉద్యోగులను నియమించు కోవాలను అధికారులను సిఎం ఆదేశించారు. నిర్మాణం పూర్తికావచ్చిన ఇవో కార్యాలయాన్ని, స్వామి వారి పల్లకీ గద్దెను, అద్దాల మండపాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, రెయిలింగ్ పనులను చూసి మెచ్చుకున్నారు. అద్దాల మండపం అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. చైనాలో 7 కిమీ దూరం లైట్లతో నిర్మించిన మాల్ ను, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని అధికారులను కోరారు. హుండీలను ఎక్కడ ఏర్పాటు చేయాలో, భక్తులు ప్రసాదం తీసుకునే కౌంటర్లు ఎక్కడ ఉండాలో అధికారులకు సూచనలిచ్చారు. బంగారు తాపడం చేసిన కళాశాలు, విగ్రహాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని అధికారులు ఈ సందర్భంగా సిఎంకు హామీ ఇచ్చారు. కాగా యాదాద్రిలో గెస్ట్ హౌస్ లిఫ్టులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయంలో మాదిరిగా రిటైరైన పూజారులు, పేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తిని వెల్లదీసుకునేలా, దయగల భక్తుల నుంచి కానుకలు స్వీకరించి వారి జీవన భృతిని కొనసాగించేలా ఇక్కడ కూడా మండపం నిర్మాణం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని అధికారులకు సూచించారు. శివాలయాన్ని దర్శించిన సిఎం, రుత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని కితాబిచ్చారు. క్యూ కాంప్లెక్సులో భక్తులకు ఆహ్లాదంగా వుండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లుండాలన్నారు. అలాగే మెట్లదారి నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వాళ్లు నేరుగా క్యూ లైన్ కాంప్లెక్స్ చేరేలా నిర్మాణాలుండాలని అన్నారు. స్వామివారి పుష్కరిణిని పరిశీలించిన సిఎం, గుండంలో స్నానం చేసే భక్తుల కోసం అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు.


పూజారులు ఆలయ సిబ్బందికి ప్రత్యేక ఇళ్లు
యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు సహా, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శిల్పులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం గుడి కింద ప్రాంగణంలో నిర్మిస్తున్న ఎసి ప్లాంట్, గ్యాస్ గోదాములను, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను, కాలికనడక నిర్మాణ పనులను కూడా సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం కిందికి దిగి, గుట్ట చుట్టూ చేపట్టిన, రహదారులు, బస్ స్టాండ్, రెసిడెన్షియల్ కాటేజ్ లు, కళ్యాణ కట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం,తదితర అభివృద్ది పనుల పురోగతిని సిఎం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. యాదాద్రి ఆలయం చుట్టూ నిర్మిత మౌతున్న రింగు రోడ్డు లోపలి పరిధిలోని పరిసర ప్రాంతాలను పచ్చదనం తో పరిపూర్ణం చేసి, దైవ భావన పరి వ్యాప్తం చేయాలన్నారు.
నష్టపోయిన దానికన్నా అద్భుతంగా దుకాణాలు
గుడి విస్తరణలో కోల్పోతున్న దుకాణ దారులతో సిఎం చాలా సేపు మాట్లాడారు. వారు కోల్పోయిన దానికన్నా గొప్పగా వారికి అన్ని వసతులతో కూడిన విశాలమైన రీతిలో షో రూముల తరహాలో నూతన దుకాణాలను కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. వారికి ఉచిత ఇంటి స్థలాలను కూడా కేటాయిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా గతం లో గుట్ట మీద వ్యాపారాలు చేసుకున్న వారికి టెంపుల్ టౌన్ లో పాత పద్దతిలోనే దుకాణాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అక్కడి నుంచి నిర్మాణం పూర్తి కావచ్చిన ప్రెసిడెన్షియల్ సూట్ ను పరిశీలించి తుది మెరుగుల కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌ఎ గొంగిడి సునీత, ఎంఎల్‌సి ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్‌పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఎ ప్రత్యేక అధికారి కిషన్ రావు, ఇఒ గీత, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇఎన్‌సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి వేలు, వాస్తు సలహా దారు సుద్దాల సుధాకర్ తేజ తదతరులు పాల్గొన్నారు.

 దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ధీటుగా యాదాద్రి ఆలయ నిర్మాణానికి పూనుకున్న ఘనత సిఎం కెసిఆర్‌కు మాత్రమే దక్కుతుంది. అద్భుతమైన కట్టడాలకు శ్రీకారం చుట్టిన ఇంజనీరింగ్ విభాగం పనితీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. చరిత్రను చాటిచెప్పే శిల్ప కళా నైపుణ్యంతో యాదాద్రి సరికొత్త శోభను సంతరించుకుంది. సిఎం కెసిఆర్‌ని యుగయుగాలుగా ప్రజలు గుర్తించుకునే రీతిలో యాదాద్రి ఆలయం నిర్మితమైంది. ఇది మహాద్భుతం.. అనితర సాధ్యం’-ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్

CM KCR Visits Yadadri Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News