ఆక్స్ఫర్డ్ డిబేట్లో మమత ప్రసంగం రద్దు
రాజకీయ ఒత్తిడుల వల్లేనని టిఎంసి విమర్శ
కోల్కతా: ఆక్స్ఫర్డ్ యూనియన్ వర్చువల్ సమావేశంలో బెంగాల్ ముఖ్యమంత్రి ప్రసంగించాల్సిన కార్యక్రమం ఆఖరి నిమిషంలో రద్దు కావడం వెనుక రాజకీయ ఒత్తిడులున్నాయని టిఎంసి ఆరోపించింది. ఆక్స్ఫర్డ్ యూనియన్ నిర్వహించే చర్చా కార్యక్రమంలో బుధవారం సాయంత్రం 230కి మమతాబెనర్జీ ప్రసంగించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు 150కి నిర్వాహకులు తెలిపారు. ఫోన్ ద్వారా నిర్వాహకులు వాయిదా వేస్తున్నట్టు తెలిపారని బెంగాల్ రాష్ట్ర హోంశాఖ పేర్కొన్నది. అయితే, వాయిదాపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇ మెయిల్ సందేశాన్ని కూడా ఆక్స్ఫర్డ్ యూనియన్ పంపించింది. ఆఖరి నిమిషంలో రద్దు కావడం వెనుక ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడులున్నాయని టిఎంసి ఎంపీ ఒకరు ఆరోపించారు. ఈ రకమైన రాజకీయాలను ఖండిస్తున్నట్టు ఆ ఎంపీ తెలిపారు. ఆక్స్ఫర్డ్ నిర్వహించే చర్చావేదికపై ప్రసంగించే అవకాశం దక్కిన మొదటి మహిళా ముఖ్యమంత్రి మమత అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఆమెకు దీనికి సంబంధించి జులైలోనే ఆహ్వానం అందిందని ఆ వర్గాలు తెలిపాయి.
1823లో ఏర్పాటైన ఆక్స్ఫర్డ్ యూనియన్ నిర్వహించిన డిబేట్లలో అమెరికా అధ్యక్షులు రిచర్డ్నిక్సన్, రోనాల్డ్ రీగన్, బ్రిటీష్ ప్రధానులు విన్స్టన్ చర్చిల్,మార్గరెట్ థాచర్, ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రసంగించారు. మమతాబెనర్జీ కార్యక్రమాలు అర్ధాంతరంగా రద్దు కావడం ఇదే ప్రథమం కాదని టిఎంసి నేతలు గుర్తు చేస్తున్నారు. స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా చికాగోలో జరిగే ఓ కార్యక్రమంలో మమత ప్రసంగించాల్సి ఉండగా రద్దయిందని వారు తెలిపారు. గతంలో చైనా పర్యటన, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మమత ప్రసంగించాల్సిన కార్యక్రమం రద్దయ్యాయని వారు పేర్కొన్నారు.
CM Mamata’s Speech cancelled in Oxford Debate