Friday, April 26, 2024

వరద బాధితులకు సిఎం రిలీఫ్ కిట్

- Advertisement -
- Advertisement -

CM relief kit for Flood Victims

 

కిట్‌లో రూ.2800 విలువైన సరకులు, మూడు బ్లాంకెట్లు
వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి సిఎం రిలిఫ్ కిట్‌ను అందజేయాలి
జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మంత్రి కెటిఆర్ సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో వరదల ముందున్న సాధారణ స్థితి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఇస్తున్న సిఎం రిలీఫ్ కిట్లను వరద బాదిత కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయాలని స్పష్టం చేశారు. ఇందులో రూ. 2,800 విలువ గల సిఎం రిలీఫ్ కిట్లో ఒక నెలకు సరిపడ నిత్యవసర వస్తువులతో పాటు 3 బ్లాంకెట్లు ఇస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు.వరద ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చే అన్ని చర్యలను యుద్దప్రాతిపదికన తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పటిష్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ప్రధానంగా యాంటి లార్వా స్ప్రేయింగ్, సోడియం హైపోక్లోరైట్, క్రిమీసంహారక ద్రావణాలను అన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాలని ఆదేశించారు. ఎంటమాలజి బృందాల ద్వారా కెమికల్స్ స్ప్రే చేయించాలని సూచించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, స్ప్రేయింగులకు అవసరమైతే అదనంగా వాహనాలను సమకూర్చుకోవాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. అలాగే వరద ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను తొలగించుటకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.వరదల వలన నాలాలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బురదను, భవన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలను తొలగించుటకు అవసరమైన సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగించాలని ఆయన సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య సంరక్షణపై నమ్మకాన్ని కలిగించాలని తెలిపారు.

మొబైల్ మెడికల్ క్యాంపుల నిర్వహణలో జిహెచ్‌ఎంసితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డిఎంఇ డాక్టర్ శ్రీనివాస్‌కు సూచించారు. భారీ వర్షాలు, వరదతో దెబ్బతిన్న ఇళ్ల ఎన్యుమరేషన్ను చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, ఇవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News