Wednesday, April 24, 2024

కామెంట్లు చేయడం ఫ్యాషనైంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం అత్యంత పారదర్శకంగా పని చేస్తోందని, అందువల్ల ఈ వ్యవస్థను నిర్వీర్యంకానివ్వొద్దని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఉన్నత్త న్యాయస్థానాల జడ్జీల నియామకాలు జరపడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘ పని చేస్తున్న వ్యవస్థను నిర్వీర్యం కానివ్వొద్దు. కొలీజియంను తన పని తాను చేయనివ్వండి. కొలీజియంకు చెందిన మాజీ సభ్యులు ఇక్కడి నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది’ అని న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాచార హక్కు చట్ంట కింద 2018లో జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం వివరాలను అందజేయాలన్న తన అభ్యర్థనను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త అంజలీ భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

కొలీజియం తీసుకునే నిర్ణయాలను సమాచార హక్కు చట్టంద ప్రశ్నించవచ్చా? అనేది ఇక్కడ ప్రశ్న. తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా?’ అని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.‘ ఆర్‌టిఐ అనేది ప్రాథమిక హక్కని కోర్టే చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దానినుంచి వెనక్కి వెళ్తోంది. చీఫ్ జస్టిస్, ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అది చెప్పింది’ అని కూడా ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ షా సమాధానమిస్తూ, ‘కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం ఆమోదించలేదు. మాజీ సభ్యులు చేసిన దేనిమీదా మేము వ్యాఖ్యానించదలచుకోలేదు. నిర్ణయాలపై కొలీజియం మాజీ సభ్యులు వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది’ అని అన్నారు.‘ మాది అత్యంతపారదర్శకమైన వ్యవస్థ. మేము వెనక్కి వెళ్లలేదు. నోటిమాటలుగా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది’ అని షా అన్నారు. అనంతరం కోర్టు ఈ కేసుపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.

2018 డిసెంబర్ 12న జరిగిన వివాదాస్పద కొలీజియం సమావేశం అజెండా, మినిట్స్, తీర్మానం వివరాలు అందజేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గత జులైలో తోసిపుచ్చింది. అంతకు ముందు ఈ అభ్యర్థనను సెంట్రల్ సమాచార కమిషనర్( సిఐసి) సహా వివిధ స్థాయిలలో తోసిపుచ్చడం జరిగింది. అయితే అప్పుడు రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ప్రదీప్ నంద్‌రాజోగ్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని 2018 డిసెంబర్‌లో జరిగిన కొలీజియం సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆటో బయోగ్రఫీ( ఆత్మకథ) ‘జస్టిస్ ఫర్ జడ్జ్’లో పేర్కొన్న విషయాన్ని అంజలి భరద్వాజ్ తన పిటిషన్లలో ప్రస్తావించారు. ఈ ఇద్దరు జడ్జిల పదోన్నతి వార్త లీక్ కావడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత వచ్చిన కొత్త కొలీజియం 2019 జనవరి 10న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతికి ఈ ఇద్దరి పేర్లను ఆమోదించలేదని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News