సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. విద్యానగర్ లోని తన నివాసం నుంచి ఈ అంతిమయాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతుబజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదగా కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర కొనసాగనుంది. సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నారు. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొననుంది.
సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న వారు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. కేసారం వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న అంత్యక్రియలకు కుటుంబీకులు, ఆర్మీ అధికారులకు మొత్తం 50 మందికి అనుమతి ఇచ్చారు. కల్నల్ పార్థివదేహాన్ని చివరిచూపు చూసేందుకు సూర్యాపేట వాసులు భారీగా తరలివచ్చారు. కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిజామాబాద్ ఎంపి అరవింద్, తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిశోర్ కుమార్ లు నివాళులు అర్పించారు.