బీజింగ్ : లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించగా, చైనా ప్రభుత్వం మాత్రం కేవలం నలుగురే చనిపోయినట్టు చెబుతోందని వ్యాఖ్యానించినందుకు క్వియు జిమింగ్ అనే బ్లాగర్కు నాన్జింగ్ నగరం లోని కోర్టు మంగళవారం 8 నెలల జైలు శిక్ష విధించింది. జాతీయ హీరోలు, అమరవీరులను కించ పరిస్తే వారికి జైలు శిక్షను అమలు చేసే కొత్త నేర చట్టానికి ఇటీవలే చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ చట్టం ప్రకారం శిక్ష పడిన మొదటి వ్యక్తి క్వియు జిమింగే. జిమింగ్ తన సోషల్ మీడియా పోస్టుల్లో అధికారులు చెప్పిన లెక్క కన్నా ఎక్కువ సంఖ్యలో సైనికులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు ఘర్షణలో పాల్గొన్న ఓ కమాండింగ్ ఆఫీసర్ ప్రాణాలు దక్కించుకున్నాడని, అత్యున్నత స్థాయి అధికారి కావడం వల్ల అతను సజీవంగా ఉన్నట్టు తన బ్లాగ్లో జిమింగ్ వ్యాఖ్యానించాడు.
గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. నలుగురే చనిపోయినట్టు ఫిబ్రవరిలో చైనా ప్రకటించింది. కానీ క్వియు జిమింగ్ చేసిన కామెంట్లు చైనాను ఇరుకున పెట్టాయి. ట్విట్టర్ లాంటి వీబో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అతనికి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీబో సోషల్ మీడియా అకౌంట్ను చైనా బ్యాన్ చేసింది. ఇదిలా ఉండగా అమరవీరులను అవమాన పరిచినట్టు కోర్టు ముందు క్వియు అంగీకరించాడు. గత ఫిబ్రవరి నుంచి గాల్వన్ ఘటనపై అనుచిత కామెంట్లను చేసిన ఆరుగురిని చైనా ఇప్పటివరకు అరెస్టు చేసింది.