హైదరాబాద్ : నగరంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున ప్రజల ప్రాణాలను కాపాడుటకు టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ చెప్పారు. వర్షాలు పడుతున్నందున శిథిల భవనాలు ఖాళీ చేయాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గత వారం రోజుల్లో 65 శిథిల భవనాలను కూల్చి వేసినట్లు చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలలో ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. భారీగా వర్షాలు కురవడంతో హైదరాబాద్ నగరంలో అనేక ఇళ్లు కూలిపోయాయి. ఇప్పటికే శిథిలావ్యస్థకు చేరిన అనేక నిర్మాణాలు ఈ వర్షాలకు కూలే స్థితికి చేరి ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలను రక్షించడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టి శిథిల భవనాల కూల్చివేతను నిర్వహిస్తున్నట్లు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. శిథిల భవనాల కూల్చివేత పై ఇటీవల జిహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.