Tuesday, April 23, 2024

‘లడ్డూ’ లడాయి!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాచలం: భద్రాచలం శ్రీ దేవస్థానంలో భక్తులకు బూజుపట్టిన లడ్డూలు విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో భద్రాచలం సిఐ నాగరాజురెడ్డి తన సిబ్బందితో సోమవారం సాయంత్రం రామాలయానికి రావడంతో వివాదం చోటుచేసుకుంది. లడ్డూలు తయారు చేసే వంటశాలకు నేరుగా పోలీసులు వెళ్లి తనిఖీలు చేస్తుండగా సిబ్బంది, అర్చకస్వాములు అడ్డుకున్నా రు. దీంతో పోలీసులకు దేవస్థానం సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఏదైనా ఫిర్యాదులు వస్తే దేవస్థానం ఇఒ దృష్టికి తీసుకెళ్లాలేగానీ.. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా పోలీసులు పవిత్రంగా భావించే వంటశాలకు రావడం పట్ల సిబ్బంది ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి రామాలయానికి చేరుకుని పోలీసులకు, దేవస్థానం సిబ్బందికి సర్థిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఫుడ్‌ఇన్స్‌పెక్టర్‌ను లడ్డూల నాణ్యతను తనిఖీ చేయాలని ఆమె ఆదేశించారు.

విచారణకు ఆదేశించిన ఎండోమెంట్ కమిషనర్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులకు నాసిరకం లడ్డూల పంపిణీ జరిగిందనే ఆరోపణ రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, భద్రాచలం ఆర్డీవో, ల్యాండ్ ప్రొటెక్షన్‌సెల్ డిప్యూటీ కలెక్టర్‌లతో కూడిన కమిటీని వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News