న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె గురువారం మరోసారి డిమాండు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కూడిన ప్రతినిధిబృందంతో కలసి ఆమె గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకుని , ఢిల్లీలో శాంతి పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈశాన్య ఢిల్లీలో ఒకపక్క నిరాటంకంగా హింసాకాండ సాగుతుంటే దాన్ని అడ్డుకోవలసిన కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండిపోయాయని రాష్ట్రపతిని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ విమర్శించారు. గడచిన నాలుగు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించామని, ఈ హింసాత్మక సంఘటనల్లో 34 మంది మరణించడం, మరో 200 మంది గాయపడడం ఆందోళనకరమైన విషయమే కాక యావద్దేశం సిగ్గుపడాల్సిన విషయమని ప్రతినిధి బృందంలో ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.