ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వ్యవహరిస్తున్నతీరు బాధ్యతారహితంగా ఉన్నదని, దురదృష్టకరమని ప్రధాని అన్నారు. మంగళవారం బిజెపి ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ఆ వివరాల్ని ఆ పార్టీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం పని చేస్తున్న వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలను కోరారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇంకా అదే భావనలో ఉన్నదని, మనకు ప్రజలు అధికారాన్ని అప్పగించిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని అన్నారు. దేశంలో వాస్తవానికి వ్యాక్సిన్ల కొరత లేదని, పదేపదే అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా వ్యతిరేక వాతావరణం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే బాధ్యతను విస్మరించిందన్నారు.