Friday, March 29, 2024

రాజ్‌భవన్ ముట్టడి రణరంగం

- Advertisement -
- Advertisement -

అడ్డుకున్న పోలీసులతో ఘర్షణ
 ‘గల్లా’ పట్టుకున్న రేణుకాచౌదరి
భట్టి, డిసిపి మధ్య తోపులాట 
పలువురు నాయకులకు తీవ్రగాయాలు
రేవంత్ సహా అనేక మంది నేతల అరెస్టు, విడుదల
11మంది కాంగ్రెస్ నేతలపై 13 సెక్షన్ల కింద కేసులు నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్‌భవన్ ముట్టడికి ఎఐసిసి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు, నేతలు గురువారం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో రాజ్‌భవన్ పరిసరాలు ఉద్రిక్తం, రణరంగంగా మారా యి. రాహుల్‌గాంధీని ఇడి విచారించడాన్ని నిరసిస్తూ ఉదయం నుంచే ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. ఖైరతాబాద్ వద్ద ఆందోళనలకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు బిజెపి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్‌టిసి బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ద్విచక్ర నిప్పుపెట్టారు. బస్సు పైకి ఎక్కి మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఖైరతాబాద్ కూడలి వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలిరావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన నేతలు రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మం త్రి రేణుకా చౌదరిని పోలీసులు అనుసరించారు. డోం ట్ టచ్ మీ అంటూ ఆమె పోలీసులకు సీరియస్ వా ర్నింగ్ ఇచ్చారు. తాను రాజ్‌భవన్‌లోకి వెళ్తే యాక్షన్ తీసుకోవాలన్నారు. తాను కట్టిన పన్నులతో వేసిన రోడ్డుపై నడిస్తే మీకేం అభ్యంతరమని రేణుకా చౌదరి పోలీసులను ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆ కార్యకర్త పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీనిని గమనించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోలీసుల తీరుపై మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను నెట్టివేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న పంజాగుట్ట ఎస్‌ఐ రేణుకా చౌదరికి అడ్డుపడే ప్రయత్నం చేయడంతో రేణు కా చౌదరి ఎస్‌ఐ చొక్కా పట్టుకొని నిలదీశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు కూడా షాక్ తి న్నారు. వెంటనే ఓ మహిళా పోలీస్ రేణుకా చౌదరి చేయి ని పంజాగుట్ట ఎస్‌ఐ చొక్కా నుంచి లాగివేశారు. రాజ్‌భవన్ వైపునకు వెళ్తున్న రేణుకా చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడతానని కూడా రేణుకా చౌదరి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పంజాగుట్ట ఎస్‌ఐ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ’మహిళా కాంగ్రెస్ నేతలపై పోలీసుల తీరు సక్రమంగాలేదు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నాపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తా. రాజ్‌భవన్ రహదారిపై వెళ్లే హక్కు నాకు ఉంది.’ అని రేణుకా చౌదరి ఈ సందర్భంగా అన్నారు. వేలాది మంది నేతలు , కార్యకర్తలు రాజ్‌భవన్ వైపు దూసుకురావడం వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డా యి. పోలీసులు లాఠీ ఛార్జీ, తోపులాటల్లో పలువురు కాం గ్రెస్ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చెంప, మెడపై గాయాలయ్యా యి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి కాలు విరిగింది. ప్రస్తుతం ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే వున్నారు. మరోనేత చామల కిరణ్‌రెడ్డిని పోలీసులు రౌండప్ చేసి కొట్టడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఆ యన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు పలువురు మహిళా నేతలకు గాయా లయ్యాయి. పోలీసులు లాఠీఛార్జీ, తోపులాటల్లో పలువు రు కాంగ్రెస్ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్‌భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, సునీతారావు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. రేవంత్‌రెడ్డిని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు, మహేష్‌కుమార్‌ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అరెస్టు సమయంలో పోలీసులు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనంలోకి ఎక్కించేటపుడు భట్టి విక్రమార్కను వెస్ట్‌జోన్ డిసిపి నెట్టివేశారు. డిసిపిని అదే స్థాయిలో నేత భట్టి తిరిగి నెట్టారు. మరోవైపు కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రా హుల్‌గాంధీని ఇడి విచారించడాన్ని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు తప్పుపట్టాయి. తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. నేడు రాష్ట్రంలోని అన్ని కేంద్ర కా ర్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. మరోవైపు తన హక్కులకు భంగం కలిగించేలా డిసిపి జోయల్ డేవిస్ వ్యవహరించారని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. డిసిపిపై ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన లాయర్‌కు ఫిర్యాదును సిద్ధం చేయాల్సిందిగా చెప్పానని భట్టి వెల్లడించారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను రాత్రి విడుదల చేశారు.
రేవంత్ సహా 10 మంది కాంగ్రెస్ నేతలపై కేసులు
పోలీసుల పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు దురుసుగా ప్రవర్తించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే యత్నం చేశారు. దీంతో పంజాగుట్ట పీఎస్‌లో పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావుతో సహా పది మంది నేతలు వున్నారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆందోళన జరిగిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసులు నమో దు చేశారు. అనుమతి లేకుండా రాజ్‌భవన్ ముట్టడికి వ చ్చారని ఆరోపణలు వచ్చాయి. మొత్తం 13 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు పోలీసులు. జనజీవనానికి ఇ బ్బంది కలిగించడమే కాకుండా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని కేసులు నమోదు చేశారు. ఈ నిరసనలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఈ ఘటనపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె దిగి వచ్చారు. తాను కావాలని కాలర్ పట్టుకోలేదని, వెనుక నుంచి తోసేయడంతో ఎస్సైని పట్టుకున్నానని ఆమె చెప్పారు. రాజకీయ కక్షతోనే ఇదం తా చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు క్షమాపణలు చెబితే.. తాను కూడా రెడీ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Congress Protest at Raj Bhavan against ED

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News